కోల్కతా: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండంతో రాష్ట్రాలు క్రమంగా ఆంక్షలు విధిస్తున్నాయి. నిన్న ఢిల్లీ ఐదు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు విధించగా.. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్ కూడా చేరింది. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, కర్ణాటక నుంచి బెంగాల్కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని, నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీచేసింది. ఈ నిబంధనలు శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణం ప్రారంభానికి 72 గంటల ముందు పరీక్ష నిర్వహించి ఉండాలని స్పష్టం చేసింది.
కరోనా కేసులు మరోమారు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కూడా అప్రమత్తమయ్యింది. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించాలని వెల్లడించింది. నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నిబంధన మార్చి 15 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నది. ఈ ఐదు రాష్ట్రాలనుంచి వచ్చే ప్రయాణికులు నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుందని గత మంగళవారం ఆదేశాలు జారీచేసింది. కాగా, మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదవుతుండటంతో పొరుగున ఉన్న రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అక్కడి నుంచి వచ్చేవారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా మహారాష్ట్రతో సరిహద్దును పంచుకునే జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి. అక్కడి నుంచి వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నాయి.