రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ మొదటినుంచి వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవసాయంపై ఆయనకు ఉన్న మక్కువతో రైతాంగ విధానమే మారిపోయింది. కాళేశ్వరం లాంటి మహాద్భుతమైన ప్రాజెక్టులు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి.
రైతుబంధు, నిరంతర, నాణ్యమైన కరెంటు లాంటి అద్భుతమైన పథకాల ద్వారా వ్యవసాయరంగం గొప్ప ఫలితాలను సాధిస్తున్నది. ప్రతి పల్లె పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నది. నేడు సుమారు కోటి 20 లక్షల ఎకరాల్లో వరి పండించే స్థాయికి ఎదగడమనేది గర్వకారణం. నీతి ఆయోగ్ పేర్కొన్నవిధంగా దేశంలోని వ్యవసాయరంగంలో కొన్ని సంస్కరణలు అవసరం. దానినే ‘క్రాప్ డైవర్సిఫికేషన్ (పంట వైవిధ్యీకరణ)’ అని అంటారు. వాటి సాధ్యాసాధ్యాలను తెలుసుకుందాం.
మన దేశం వ్యవసాయాధారితమైనప్పటికీ స్థూల ఉత్పత్తిలో 17 శాతం మాత్రమే విలువ ఉండటం విస్మయానికి గురిచేస్తున్నది. వరి ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ మిగతా పంటల్లో కొరత ఏర్పడుతున్నది. ఇటీవల కేంద్రం ఆహార నిల్వలపై మరో ప్రకటన విడుదల చేసిం ది. ఐదేండ్లవరకు సరిపోయే నిల్వలున్నాయని స్పష్టం చేసింది. అధిక ఉత్పత్తి, తక్కువ గిరాకీ ఉన్నప్పుడు అధికంగా పండించిన పంటల ఉత్పత్తులను బజారులో కొనకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడుతాయి. దీంతో రైతు లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అదే సాగుభూమిలో వేసిన పంటను పలుసార్లు వేయడం ద్వారా సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. నేల కోత, భూ క్షయం వంటి సమస్యలు తలెత్తుతాయి. వాడిన ఎరువులనే తరచూ వాడటం, విశ్రాంతి లేకుండా సాగుచేయడం ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటన్నింటికి ఒకే ఒక పరిష్కారం ‘పంట వైవిధ్యీకరణ’విధానం.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మెగా ఫుడ్ పార్క్స్ను నెలకొల్పబోతున్నది. అగ్రి స్టార్టప్స్, అగ్రి ఫండింగ్ విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు వ్యవసాయరంగంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకువస్తున్నారు. సన్రైజింగ్ ఇండస్ట్రీగా పేర్కొనే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్నందిస్తూ చైన్ రెవెల్యూషన్కు శ్రీకారం చుట్టింది. పంటల వైవిధ్యీకరణతో కొత్త పంటలు వేయ డం, మార్కెట్ విధానాలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టి, డిమాండ్ ఉన్నందున, భారీగా ఉత్పత్తి చేయడం వల్ల రైతుల సంపద పెరిగే అవకాశం ఉన్నది.
అశోక్ దల్వాయి కమిటీ సిఫార్సుల మేరకు 2022 వరకు రైతుల ఆదాయం రెండింతలు పెరిగే విధానంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్’కు సంబంధించిన కొన్ని సంస్థలు ‘క్రాప్ డైవర్సిఫికేషన్’పై అనేక పరిశోధనలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పండించే వరిలో Glyca -mic Index కూడా తక్కువ ఉండేవిధంగా సాగు చేయడం గొప్ప విషయం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 17 శాతం ఉన్న వ్యవసాయరంగం 25 శాతం వరకు వృద్ధి చెందుతుంది. రైతుబంధు తరహాలోనే పంట వైవిధ్యీకరణకు పథకాన్ని తీసుకురావాలి.
ఈ నేపథ్యంలో రైతులు కూడా పంటల వైవిధ్యీకరణకు ముందుకురావాలి. వరి, గోధుమ, పత్తి సాగుచేస్తూనే కొత్త విధానాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా పంట విలువ పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. పంటల వైవిధ్యీకరణలో కూడా ఆదర్శంగా ఉంటూ ఎగుమతులను భారీగా చేసినట్టయితే రాష్ర్టానికి తిరుగుండదు.
కన్నోజు శ్రీహర్ష
89851 30032