నగరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తను ఎదుర్కొన్న ఆరోగ్య సవాళ్లు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న వైసీపీ సర్పంచ్లను రోజా నగరిలోని తన నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు అంటేనే మానసిక ఒత్తిడితో కూడుకున్నవని పేర్కొన్నారు.
తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బీపీ సమస్య వచ్చిందని, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత షుగర్ బారిన పడ్డానని ఆమె తన వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని గురించి రోజా వెల్లడించారు. గత వైసీపీ పాలనలో జగన్ నేతృత్వంలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని, ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కరించడం తమ పార్టీ సంస్కృతి అని చెప్పారు.
ఎన్నికల సమయంలో కూటమి నేతల్లా తాము అబద్ధాలు చెప్పలేకపోయామని, అందుకే ఓటమి పాలయ్యామని రోజా అన్నారు. వైసీపీ సర్పంచ్లు గర్వంగా ప్రజల్లో తిరిగేలా పనులు చేశారని మెచ్చుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ పార్టీ సత్తా ఏంటో చాటాలని పిలుపునిచ్చారు. అబద్ధాలతో గెలిచిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.