అశ్వారావుపేట/అశ్వారావుపేట టౌన్, మార్చి 3: సమాజంలో మంచి విద్యావంతులను ఉపాధ్యాయులు తయారుచేయాలని, ఆ దిశగా మంచిబుద్ధులతో కూడిన విద్యను అందించాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమ పరిశీలన కోసం గురువారం అశ్వారావుపేట మండలంలో కలెక్టర్ పర్యటించారు. నారంవారిగూడెం, పేరాయగూడెంలోని నెహ్రూనగర్, అశ్వారావుపేట బాలుర ఉన్నత పాఠశాల, వడ్డెరబజార్లోని ఎంపీపీఎస్తోపాటు ఊట్లపల్లి పంచాయతీలకు వెళ్లారు. ఎస్ఎంసీ ఆధ్వర్యంలో ‘మన ఊరు – మన బడి’లో కల్పించాల్సిన సదుపాయాలను పరిశీలించారు. పేరాయిగూడెం పంచాయతీలోని నెహ్రూనగర్ ఎంపీపీఎస్లో తాగునీటి సౌకర్యం కోసం బోరు ఏర్పాటు చేయాలని సర్పంచ్ను ఆదేశించారు. అశ్వారావుపేట హైస్కూల్ల్లో కట్టెల పొయ్యిపై విద్యార్థులకు వంట చేస్తుండడాన్ని గమనించారు. గ్యాస్ పొయ్యిలు ఏర్పాటు చేసుకోవాలని ఎంఈవోకు సూచించారు.
నారంవారిగూడెం వచ్చిన కలెక్టర్ అనుదీప్ ఐబీ ఇంజినీర్లు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో కొంత అసహనం వ్యక్తం చేశారు. వారి కోసం కొంత సమయం వరకూ ఎదురు చూశారు. అశ్వారావుపేట వడ్డెరబాజార్ ఎంపీపీఎస్ను సందర్శించిన సమయంలో పాఠశాల సమీపంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఎంపీడీవో విద్యాధరరావు, ఎంపీవో సీతారామరాజులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంఈవో కృష్ణయ్య, ఐబీ డీఈ కృష్ణ, ఏఈ కృష్ణ, ఈవో గజవెల్లి హరికృష్ణ, సర్పంచ్లు రమ్య, సుమతి, జ్యోత్స్నాబాయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.