న్యూఢిల్లీ: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు లిస్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశం వివాదాస్పదమవుతోంది. దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు నిరాకరించడం వల్లే ఆ ఇద్దర్నీ తప్పించినట్లు కారణాలు తెలుస్తున్నాయి. రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడకుండా.. హార్ధిక్ పాండ్యాతో కలిసి ఇషాన్ కిషన్ ఐపీఎల్ కోసం శిక్షణ తీసుకున్నాడు. మరో వైపు శ్రేయాస్ అయ్యర్ కూడా దేశవాళీ క్రికెట్ ఆడేందుకు నిరాకరించి ఐపీఎల్ పై దృష్టి పెట్టాడు. కేకేఆర్ జట్టుతో కలిసి అతను శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది.
అయితే ఈ అంశం పట్ల బీసీసీఐ చీఫ్ సెలెక్టర్(BCCI Chief Selector) అజిత్ అగార్కర్ ఆగ్రహంగా ఉన్నారు. వెన్ను నొప్పి ఉన్నా.. ఐపీఎల్ క్యాంపుకు శ్రేయాస్ వెళ్లడాన్ని అగార్కర్ సీరియస్గా తీసుకున్నారు. కాంట్రాక్టు ప్లేయర్ల జాబితాను రిలీజ్ చేసేది బీసీసీఐ సెలక్టర్లే కావడం గమనార్హం. జాతీయ జట్టుకు ఆడని సమయంలో దేశవాళీ టోర్నీలో ఆడాలని క్రికెటర్లకు బీసీసీఐ తెలిపింది.