By Elections Bastions Breached | ఢిల్లీతోపాటు ఐదు రాష్ట్రాల్లో జరిగిన మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో నేతల కంచుకోటలు బ్రేక్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజంఖాన్కు పెట్టనికోటగా ఉన్న రాంపూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఘన్శ్యామ్ లోధీ విజయం సాధించారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన ఆజంగఢ్ నుంచి కూడా బీజేపీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్వపై బీజేపీ ప్రత్యర్థి దినేశ్ లాల్ యాదవ్ `నిరాహువా` గెలుపొందారు. అఖిలేశ్ యాదవ్, ఆజంఖాన్ ఇటీవల అసెంబ్లీకి ఎన్నికవ్వడంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక పంజాబ్ సీఎం భగవంత్మాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగ్రూర్ లోక్సభ స్థానంలో శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) అభ్యర్థి సిమ్రాన్జిత్ సింగ్ మాన్ 5000 పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు.
2014, 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే సంగ్రూర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అతి తక్కువ ఓటింగ్ శాతం రికార్డైంది. 2014లో 76.71 శాతం, 2019లో 72.44 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఉప ఎన్నికలో కేవలం 45.30 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఉప ఎన్నికతో లోక్సభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
ఢిల్లీ అసెంబ్లీలో రాజిందర్ నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజేశ్ భాటియాపై ఆప్ అభ్యర్థి దుర్గేశ్ పాఠక్ గెలుపొందారు. ఈ స్థానం నుంచి గెలుపొందిన రాఘవ్ చద్దా ఇటీవల రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. జార్ఖండ్లోని మండార్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పినెహా టర్కీ విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బంధు టర్కీపై అవినీతి ఆరోపణలతో అనర్హతకు గురవ్వడంతో మండార్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో బంధు టర్కీ తన కూతురు శిల్పి నెహా టర్కీకి టికెట్ తెచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి గత ఫిబ్రవరిలో మరణించడంతో జరిగిన ఆత్మకూర్ స్థానానికి వైసీపీ అభ్యర్థి.. గౌతమ్రెడ్డి సోదరుడు విక్రం రెడ్డి విజయం సాధించారు. త్రిపురలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగితే, రెండు చోట్ల బీజేపీ, ఒకచోట కాంగ్రెస్ గెలుపొందాయి. త్రిపుర సీఎం మాణిక్ సహా.. బార్డోవాలీ స్థానం నుంచి ఆరువేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు.