న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఎయిర్ ఇండియా బకాయిల్ని తీర్చడానికి, అది నడపడానికి అవసరమయ్యే రుణాన్ని టాటాలకు వివిధ బ్యాంక్లు ఆఫర్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా మార్కెట్ నుంచి సమీకరించే రేటుతో సమానంగా 4.25 శాతం వడ్డీ రేటుతోనే రూ.35,000 కోట్ల రుణాన్ని టాటా సన్స్ కంపెనీ టలేస్కు ఇచ్చేందుకు బ్యాంక్లు ఆసక్తితో ఉన్నాయని సంబంధిత లావాదేవీని చూస్తున్న వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేస్తున్న టలేస్.. ఆ విమానయాన సంస్థకు ప్రస్తుత రుణదాతలైన బ్యాంక్ల నుంచి రూ. 23,000 కోట్ల రుణం కోసం బిడ్స్ను పిలిచింది. ఇలా సమీకరించే రుణాన్ని.. ఎయిర్ ఇండియాకు ఉన్న రూ. 18,000 కోట్లు బకాయిల్ని తీర్చేందుకు, ప్రభుత్వానికి చెల్లించేందుకు టలేస్ ఉపయోగిస్తుంది. మరో రూ.5,000 కోట్లు ఎయిర్ ఇండియా తొలి నిర్వహణా వ్యయాల కోసం వాడుతుంది.
బ్యాంక్ల నుంచి భారీ స్పందన..
టాటాలు కోరిన రుణంపై రేటింగ్ లేకున్నా, వడ్డీ కేవలం ప్రభుత్వ బాండ్లతో సమానంగా ఉన్నా, అన్సెక్యూర్డ్ అయినప్పటికీ బ్యాంకర్ల నుంచి మంచి స్పందన లభించిందని.. దాదాపు రూ. 3,000 కోట్ల రుణాన్ని మంజూరు చేసిన ఒక బ్యాంక్ అధికారి వెల్లడించారు. ఎయిర్ ఇండియా వ్యాపారంపై ఆరు నెలల తర్వాతగానీ అంచనాల్ని ప్రకటించలేమని టలేస్ తెలిపినా, ఈ స్థాయిలో రుణదాతలు స్పందించడం టాటాల పట్ల బ్యాంక్లకు ఉన్న నమ్మకానికి సంకేతమన్నారు. ఎస్బీఐ, బీవోఐ, పీఎన్బీ, యూబీఐలు టలేస్కు రూ. 12,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకూ క్రెడిట్ లిమిట్లను మంజూరు చేసినట్టు సంబంధిత బ్యాంకర్ ఒకరు చెప్పారు. క్రెడిట్ లిమిట్ కేటాయింపులపై జనవరి 10-15 మధ్య బ్యాంక్లకు టాటాలు తెలియచేస్తారు. ఎంసీఎల్ఆర్ రేటుగా ఉన్న 7 శాతాని కంటే తక్కువ వడ్డీకి టాటాలకు రుణాలు మంజూరు చేసిన బ్యాంక్ల బోర్డులు ఇందుకోసం ప్రత్యేక తీర్మానాల్ని ఆమోదించాయి.