ఢాకా : భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా అల్లర్లు సృష్టించడంలో జమాతే ఇస్లామీ హస్తమున్నదని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. భారత్లోని మైనార్టీలైన ముస్లింల పట్ల నరేంద్ర మోదీ కౄరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రవాద సంస్థలు ప్రజలను ముఖ్యంగా యువతను ఆందోళన బాట పట్టించాయి.
మోదీ పర్యటనను అడ్డంగా పెట్టుకుని బంగ్లాదేశ్ ప్రధాని పీఠం పైనుంచి షేక్ హసీనాను దింపేయాలని అక్కడి ప్రతిపక్షాలు కుట్రపన్నాయి. ఈ సంగతులన్నీ ఇంటెలిజెన్స్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
బంగ్లాదేశ్లో మోదీ రెండు రోజుల పర్యటన సందర్భంగా అక్కడ ఆందోళనలు చోటుచేసుకోవడం, వారిని అదుపుచేసే ప్రయత్నంలో కాల్పులు జరుపడంతో 12 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. పెద్ద సంఖ్యలో యువకులు జైలుపాలయ్యారు.
మోదీ పర్యటన సందర్భంగా చెలరేగిన హింస నిరసనల కారణంగా లేదని, దాని కోసం కుట్ర జరిగిందని గూఢచార సంస్థలు పేర్కొన్నాయి. నిషేధిత సంస్థ జమాతే ఈ ఇస్లామీ హస్తం దీని వెనుక ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, పోలీసులు, మీడియా, ప్రభుత్వ కార్యాలయాలపై పెద్ద ఎత్తున దాడి చేయడానికి సన్నాహాలు జరిగాయి. మోదీ పర్యటన సందర్భంగా శాంతిభద్రతల సమస్యను సృష్టించడం ద్వారా షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జమాతే ఈ ఇస్లామీ భారీ మొత్తంలో డబ్బును పంపిణీ చేసింది.
దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన ఘర్షణలకు సంబంధించి జమాత్, షిబీర్, హిఫాజత్ సంస్థలకు చెందిన 200 మంది నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఢాకాలోని బైతుల్ ముకారామ్ జాతీయ మసీదులో శుక్రవారం జరిగిన ఘర్షణలో 600 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైందని పోలీసులు సోమవారం తెలిపారు. ఢాకాలోని కేంద్రీయ గ్రంథాలయానికి ఆందోళనాకారులు నిప్పుపెట్టడంతో పెద్ద సంఖ్యలో పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి.
బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో భాగంగానే ఆందోళనలకు శ్రీకారం చుట్టినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. జమాత్, హిఫాజత్, ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ.. ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నాయని నివేదికలో తెలిపారు. ఈ సంస్థలు నిరసన తెలిపిన తీరు, వారి ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుందని పలువురు పౌర సమాజం సభ్యులు ఆరోపించారు. దేశంలో శాంతి, ప్రగతికి ఆటంకం కలిగించకూడదని వారు కోరుతున్నారు.
ఆందోళనాకారులు ప్రదర్శిస్తున్న విధానం తప్పు అని పౌర సమాజం చెప్తున్నది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షించి ఉచితంగా లక్ష డోసుల కరోనా టీకా అందజేసిన భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుపడం సబబు కాదని అక్కడి పౌర సమాజం నేతలు పేర్కొంటున్నారు. కాగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఢాకాతోపాటు దేశంలోని ఇతర ముఖ్య నగరాల్లో బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ సైనికులను మోహరించింది.
రాజస్థాన్ ఆవిర్భావ దినం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..