PM Modi : బంగ్లాదేశ్ (Bangladesh) లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్నది. ఈ నెల 17న బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (BNP) అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ (Tariq Rehman) ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి రావాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కి ఆహ్వానం అందింది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానం పంపింది.
కాగా ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించింది. దాంతో తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్లోని సదరన్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం 13 దేశాలకు ఆహ్వానాలు పంపించింది.
ఈ ఆహ్వానాలు అందుకున్న దేశాల్లో భారత్తోపాటు చైనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ, ఖతార్, శ్రీలంక, నేపాల్ తదితర దేశాలు ఉన్నాయి. ఇదిలావుంటే బంగ్లాదేశ్లో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం వచ్చాక భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఆహ్వానం అందడం గమనించదగ్గ విషయం. అయితే ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా..? అనేది తెలియాల్సి ఉంది.