యాదాద్రి భువనగిరి, మే 12 (నమస్తే తెలంగాణ) : పోక్సో కేసులో తనకు, తన కుమారుడికి సంబంధం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తడిబట్టలతో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట, యాదగిరిగుట్టలో ప్రమాణం చేస్తారా అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి సవాల్ విసిరారు. గతంలో పలు సందర్భాల్లో తడిబట్టలతో ప్రమాణమంటూ డ్రామాలు చేశారని, యాదగిరిగుట్టలో సైతం హంగామా చేశారని గుర్తు చేశారు.
బాధిత కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసిన బండి సంజయ్తోపాటు బీజేపీ నేత సంగప్పపై కూడా పోక్సో కేసు నమోదు చేయాలన్నారు. మంగళవారం భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిందితుడు పరారీలో ఉన్నారని సీఎం చెప్పడం సిగ్గు చేటన్నారు. ప్రధాని పర్యటన ముగియగానే.. పోక్సో కేసుతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని భావించి.. పరువు కాపాడుకునేందుకు తెరపైకి సిట్ను తెచ్చారని మండిపడ్డారు.
భగీరథ్ తప్పు చేయకుంటే ఎందుకు పారిపోయాడో చెప్పాలని ప్రశ్నించారు. భగీరథ్ అంశం తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అనడం సిగ్గుచేటన్నారు. బండి భగీరథ్కు సంబంధం లేకపోతే హానీ ట్రాప్ కేసు ఎలా పెట్టారని ప్రశ్నించారు.
పోలీసుల విచారణలో బండి భగీరథ్ తప్పు చేశాడని తేలితే ఎన్కౌంటర్ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, నగేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు