న్యూఢిల్లీ, మే 12: కోర్టుల ఆధునీకరణపై సమగ్రమైన రోడ్మ్యాప్ను రూపొందించాలంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ‘మౌలిక సదుపాయాల న్యాయ సలహా కమిటీ’ని ఏర్పాటుచేశారు. జస్టిస్ అరవింద్ కుమార్ను ఈ కమిటీకి చైర్పర్సన్గా నియమించారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో పని పరిస్థితుల్ని మెరుగుపర్చటం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటంపై కమిటీ దృష్టిసారించనున్నది. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల కొరత, సౌకర్యాలను సూచించటం ఈ కమిటి విధి విధానాల్లో భాగంగా ఉంది. కోర్టుల కంప్యూటరీకరణకు చర్యలు సూచించటం, డిజిటల్ అంతరాన్ని తగ్గించటం వంటి చర్యలను సిఫార్సు చేయనున్నది. ఆగస్టు 31లోగా మధ్యంతర నివేదికను సమర్పించాలని కమిటీని సీజేఐ కోరారు. దేశవ్యాప్తంగా కోర్టుల కోసం ప్రభుత్వ మద్దతు, రూ.40,000 కోట్ల నుండి రూ.50,000 కోట్ల వరకు నిధులను సమీకరించటంపై ఈ కమిటీ ప్రధానంగా దృష్టిసారిస్తుంది.