హైదరాబాద్/కరీంనగర్, జనవరి 2 : అబద్ధాల బండి మరో డ్రామాకు తెరతీశారు. రాష్ట్రంలో ఏదో ఒకసాకు చెప్పడం.. రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రివాజుగా మారింది. దీంట్లో భాగంగా ఆదివారం రాత్రి కరీంనగర్లో జాగరణ పేరుతో వేలమంది కార్యకర్తలతో ఓ డ్రామా ఆడేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి ఆయన చేపట్టిన దీక్షకు అసలు పోలీసుల నుంచి కనీసం అనుమతి కూడా తీసుకోలేదు. కొవిడ్ నిబంధనలు అతిక్రమించి దీక్ష చేపట్టరాదని పోలీసులు నోటీసు జారీ చేసినా వినలేదు. మూడు గంటల హైడ్రామా తరువాత బండిని అదుపులోకి తీసుకొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ఒకవైపు దేశంలో ప్రబలుతున్న ఒమిక్రాన్, కరోనా నేపథ్యంలో ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టొద్దని, రాజకీయ కార్యక్రమాలతో వ్యాధిని వ్యాప్తి చేయవద్దని మార్గదర్శకాలు ఇస్తుంటే.. మరోవైపేమో సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం నిరసన ప్రదర్శనలకు దిగుతారు. ఒక్క కేంద్ర ప్రభుత్వమే కాదు..రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కూడా కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యాధివ్యాప్తిని అడ్డుకోవడానికి ఆంక్షలను అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిసెంబర్ 25న ప్రభుత్వం తొలిసారి బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలను చేపట్టడం నిషేధమని జీవో ఇచ్చింది. డిసెంబర్ 25న ఇచ్చిన ఆదేశాలు, ఆ తర్వాత జనవరి ఒకటో తేదీన ఇచ్చిన అనుబంధ ఉత్తర్వుల ప్రకారం జనవరి పదో తేదీ వరకు నిషేధం అమలులో ఉన్నది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కనీసం కేంద్రం ఇచ్చిన ఆదేశాలు కానీ, హైకోర్టు మార్గదర్శకాలు కానీ ఎంతమాత్రం పట్టించుకోకుండా బేఖాతరుచేసి లేని సమస్యను పట్టుకొని తొండిదీక్షకు దిగారు.
బదిలీలపై తప్పుడు ప్రచారాలు
జాగరణ పేరుతో బండి సంజయ్ చెప్తున్న దాంట్లో నిజమేమైనా ఉన్నదా అంటే అది కూడా అర్ధ సత్యమే. ఈ మాట ఉద్యోగ సంఘాల నేతలే చెప్తున్నారు. వాస్తవానికి బదిలీలు, ఉద్యోగుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 317 అమలు దాదాపు పూర్తయింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు స్వాగతించాయి. జీవో అమలులో సమస్యలు వచ్చినచోట ప్రభుత్వమే ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించింది. భార్యాభర్తలు, వికలాంగులు తదితరుల విషయంలో సానుకూల ధోరణితో ప్రభుత్వం వ్యవహరించింది. జోనల్ అంశం తేలిపోవడం, ఉద్యోగుల పునర్విభజన పూర్తి కావడంతో కొత్త సంవత్సరంలో సుమారు లక్ష కొత్త ఉద్యోగాలను భర్తీచేసే కార్యక్రమంలో ప్రభుత్వం నిమగ్నమయింది. రేపోమాపో టీఎస్పీఎస్సీ సహా ఉద్యోగ నియామక బోర్డులన్నీ కొత్తగా ఉద్యోగల భర్తీ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. కొత్త ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం సుమారు 60 వేలకు పైగా ఉద్యోగాలకు ఆర్థిక అనుమతులను ఇప్పటికే ఇచ్చింది. ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చివరి అంకానికి వెళ్లడం, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవ్వడం బీజేపీకి ఇష్టంలేనట్టున్నది. అందుకే రాత్రికి రాత్రి జాగరణ పేరుతో డ్రామా మొదలుపెట్టారు. చుట్టూ కార్యకర్తలను మోహరించి ఇంట్లో దీక్ష పేరుతో రాజకీయ హైడ్రామా చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించినా.. బండి ఇంటి తలుపులు తీయలేదు. పోలీసులు బండి సంజయ్ను కలిసి విషయం చెప్పేందుకు ప్రయత్నించినా సరైన స్పందన రాలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో అదుపులోకి తీసుకున్నారు. దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలన్న నీచ బుద్ధితో తన అనుచరులతో ఆందోళన కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వాటిని భగ్నంచేశారు.
అనుమతి లేకుండా దీక్ష లేమిటి?
ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీల కోసం అన్ని వర్గాల అనుమతితో తీసిన 317 జీవోను సవరించాలని కోరుతూ ఆదివారం రాత్రి బండి సంజయ్ కరీంనగర్లోని తన కార్యాలయం ఎదుట జాగరణ దీక్ష తలపెట్టారు. చైతన్యపురిలోని వీధులను మూసివేస్తూ టెంట్లు వేశారు. ఈ జాగరణ దీక్షకు పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించేందుకు సన్నాహాలుచేశారు. దీక్షకు రాష్ట్ర ముఖ్యనాయకులు కూడా వచ్చారు. పోలీసుల అనుమతి కోసం ప్రయత్నించనైనాలేదు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే హెచ్చరిస్తూ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకే ఎంపీ కార్యాలయానికి నోటీసులిచ్చారు. నోటీసులను బేఖాతరు చేసిన బండి.. దీక్షకు పూనుకొన్నారు. విషయాన్ని తెలుసుకొన్న పోలీసులు బీజేపీ నేతలతో పదే పదే చర్చించారు. దీక్ష చేయవద్దని నచ్చజెప్ప ప్రయత్నించారు. ససేమిరా అనడంతో రాత్రి ఏడు గంటల సమయంలో పోలీసులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగక తప్పలేదు. షామియానాలను తొలగించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. దీంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు పోలీసులను పిడిగుద్దులు గుద్దడం, కాళ్లతో తన్నడం కనిపించింది. రాత్రి ఎనిమిదిగంటలకు పోలీసుల కండ్లుకప్పి కార్యాలయంలోకి చొరబడ్డ సంజయ్.. లోపలినుంచి తాళం వేసుకొన్నారు. బండి సంజయ్ని అదుపులోకి తీసుకునే వరకు కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీపీ సత్యనారాయణ స్వయంగా రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలను అదుపు చేశారు. మూడుగంటల హైడ్రామా తరువాత 10.30 గంటలకు పోలీసులు బండి సంజయ్ని అదుపులోకి తీసుకుని మానకొండూర్ పోలీసు స్టేషన్కు తరలించారు.
కార్యకర్తలు తప్ప ఉద్యోగులు ఏరి?
బండి దీక్ష పేరుకు ఉద్యోగుల కోసమేనని ఎంతగా చెప్పుకొన్నా.. ఎంపీ కార్యాలయం దగ్గర బీజేపీ కార్యకర్తలు, నాయకులు తప్ప ఒకరిద్దరు తప్ప ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. నాలుగు రోజుల ముందే బండి తన అనుచరగణంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులతో చర్చలు జరిపినప్పటికీ ఆ వర్గాల నుంచి పెద్దగా స్పందన రాలేదు.