అటు నేనే.. ఇటు నేనే.. ఎటూ కాకుండా ఎగిరేదీ నేనే! అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర బీజేపీ తీరు. లేని సమస్య ఒకదాన్ని పట్టుకోవాలి. దీక్ష పేరుతో రచ్చ చేయాలి. జనాన్ని రెచ్చగొట్టాలి. సర్కారుపై బురదజల్లాలి. ఇదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాటకం. వడ్లపై రైతులు కర్రుకాల్చి వాతపెట్టినా గుణపాఠం నేర్వని బండి సంజయ్ తాజాగా 317 జీవో రద్దు అనే డిమాండ్తో కొత్త పాట మొదలుపెట్టారు. దేశంలో కరోనా పెరుగుతున్నది. కొవిడ్ వ్యాప్తి చెందకుండా కఠినంగా వ్యవహరించండి అని న్యాయస్థానాలు పదేపదే ఆదేశిస్తున్నాయి. కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయండి అని ఆయన పార్టీకే చెందిన కేంద్ర ప్రభుత్వం రోజుకోసారి మార్గదర్శకాలు పంపుతున్నది. మొన్నటికి మొన్న కరీంనగర్లో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపించి జనాన్ని సతమతం చేసింది. సంజయ్కి మాత్రం ఇవేవీ పట్టవు. జోనల్ విధానం అమల్లో భాగంగా జరుగుతున్న ఉద్యోగుల కేటాయింపుల్లో ఏదో జరిగిపోతున్నదని ఆరోపిస్తూ ఆయన మరోసారి దీక్ష డ్రామా మొదలుపెట్టారు.
వింతల్లోకెల్లా వింత ఏమిటంటే, ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ దీక్ష చేసేదీ ఆయనే. ఉద్యోగ ఖాళీలను గుర్తించేందుకు చేపట్టిన జోనల్ కసరత్తును అడ్డుకునే దీక్ష చేసేదీ ఆయనే. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానంలో మార్పుల కోసం 2016లో కేంద్రానికి ప్రతిపాదన పంపితే, మూడేండ్లు నాన్చీనాన్చీ మురగబెట్టింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. అనేక విజ్ఞప్తులు, ప్రయత్నాలతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ విధానానికి అనుమతి తెచ్చుకొని, ఐదు దశల్లో అమలు ప్రక్రియ ప్రారంభించింది. ఇది ఇప్పటికే తుది దశకు చేరింది.
మరి జోనల్ వ్యవస్థను కేంద్రం జాప్యం చేసినప్పుడు ఇదే ఉద్యోగుల మీద, తెలంగాణ నిరుద్యోగుల మీద బీజేపీ, బండి సంజయ్ ప్రేమ ఎక్కడికి పోయింది?
రాష్ట్రంలో మొత్తమ్మీద దాదాపు 21 వేల గెజిటెడ్ ఉద్యోగులు, దాదాపు 2 లక్షల 22 వేల ఎన్జీవోలు, 31 వేల మంది నాలుగో తరగతి ఉద్యోగులు, దాదాపు లక్షా 20 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
అంటే జోనల్ వ్యవస్థ పరిధిలో మొత్తమ్మీద నాలుగు లక్షల మంది ఉద్యోగులుండగా, తాజాగా బదిలీ జరిగింది కేవలం 40 వేలకు లోపే. అంటే పది శాతంకంటే తక్కువే.
కొత్త జోనల్ వ్యవస్థ మేరకు పోస్టుల కేటాయింపు, ఉద్యోగుల సర్దుబాటు, ఖాళీల గుర్తింపు అయితే తప్ప, కొత్త నియామకాలకు నోటిఫికేషన్లు వేయడం సాధ్యంకాదు. ఉద్యోగ ఖాళీలను నింపాలని ఒకవైపు అడుగుతూనే, మరోవైపు జోనల్ కసరత్తును అడ్డుకోవడం ఆయన ద్వంద్వ ప్రమాణాలను నిదర్శనమని ఉద్యోగ సంఘాల నాయకులే విమర్శిస్తున్నారు.
జోనల్ విధానంలో బదిలీ అయిన వారిలో అత్యధిక శాతం మందికి గత ఉమ్మడి జిల్లా పరిధిలోనే పోస్టింగులు వచ్చాయి. సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేసేందుకు రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 8 టీచర్ల సంఘాలు లిఖిత పూర్వకంగా ఆమోదం తెలిపాయి. అయినా లేని సమస్యను ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు సంజయ్ విఫలయత్నం మొదలుపెట్టారు.
అసలు సంగతి ఏమిటంటే, స్థానికత అనేది కేవలం నియామకాలకు మాత్రమే వర్తిస్తుంది. ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత, పరిపాలన అవసరాల కోసం ప్రభుత్వం ఉద్యోగుల సేవలను ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. నియామకాలకే తప్ప, బదిలీలకు స్థానికత వర్తించదు. అలా వర్తింపజేసే చట్టం, ఉత్తర్వు ఏదీ లేదు. అందుకే హైకోర్టు కూడా ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అయినా ఇంగితజ్ఞానం లేకుండా, పరిపాలన పరమైన కనీస అవగాహన కూడా లేకుండా బండి సంజయ్ కరోనా కాలంలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం గమనార్హం.