దుబ్బాక: బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై (Kotha Prabhakar Reddy) హత్యాయత్నానికి (Murder Attemt) నిరసనగా దుబ్బాక (Dubbak) నియోజకవర్గంలో బంద్ కొనసాగుతున్నది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బంద్కు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వ్యాపారస్థులు స్వచ్ఛంగా బంద్ పాటిస్తున్నారు. దీంతో దుబ్బాక పట్టణంతోపాటు నియోజకవర్గం వ్యాప్తంగా ఒక్క షాప్ కూడా తెరచుకోలేదు. మండల కేంద్రాల్లో, ప్రతి గ్రామంలో ఉదయం 11 గంటలకు నల్లజెండాలతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు.
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై నిన్న హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, ఓ దుండగుడు పక్కా ప్లాన్తో కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం పూర్తి చేసుకొని మరో గ్రామానికి బయలుదేరారు. సూరంపల్లి చర్చి పాస్టర్ రంగయ్య తల్లి నర్సవ్వ ఇటీవల చనిపోయిన విషయం తెలుసుకొన్న ఎంపీ.. వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. వారి ఇంటి నుంచి తన వాహనం ఎక్కేందుకు ప్రభాకర్రెడ్డి వస్తుండగా, గటాని రాజు అనే వ్యక్తి ఎంపీ కడుపులో కత్తితో దారుణంగా పొడిచాడు.
సూరంపల్లిలో ఎంపీ ప్రచారం ముగిసిన వెంటనే కవరేజీకి వచ్చిన పాత్రికేయులు వెళ్లిపోయారు. రాజు మాత్రం ఎంపీ ప్రభాకర్రెడ్డిని అనుసరిస్తూ ఫాస్టర్ రంగయ్య ఇంటి వద్దకు వెళ్లాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఎంపీ ప్రభాకర్రెడ్డిని విష్ చేస్తున్నట్టు దగ్గరికి వచ్చి, తన ప్యాంట్ జేబులో దాచుకున్న కత్తితో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఎంపీ వ్యక్తిగత సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు ఆయనను హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి 1 గంట 45 నిమిషాల్లో అంబులెన్స్లో మధ్యాహ్నం 2:56 గంటలకు సికింద్రాబాద్లోని యశోద దవాఖానకు తీసుకొచ్చారు.
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కత్తేనని తేలిపోయింది. అత్యంత క్రూరంగా ఈ దాడికి పాల్పడింది మిరుదొడ్డి మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త గటాని రాజుగా గుర్తించారు. అతను కాంగ్రెస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు తేలింది. అయితే దాడితో తమ పార్టీకి, తమ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సిగ్గులేకుండా సన్నాయి నొక్కులు నొక్కారు. రేవంత్రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది. సోషల్ మీడియాతో వారి బండారం బయటపడింది. దాడికి పాల్పడిన గటాని రాజు తన సోషల్ మీడియా అకౌంట్లో కాంగ్రెస్కు మద్దతుగా పోస్ట్లు పెట్టాడు. మెడలో కాంగ్రెస్ కండువాతో ఉన్నటువంటి ఫొటోను డీపీగా పెట్టుకున్నాడు. అంతే కాకుండా గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించాడు. ఇందుకు సంబంధించి ప్రచార రథంపై తాను మాట్లాడుతున్న ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్లో ‘జై కాంగ్రెస్ మిరుదొడ్డి మండల్’ ట్యాగ్లైన్ రాసుకోవడం అతడు క్రియాశీల కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పేందుకు మరో ప్రధాన సాక్ష్యం. దాడి జరిగిన తర్వాత రాజు సంబంధించి సోషల్ మీడియా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అతను కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తేనని సోషల్ మీడియా కోడై కూసింది.