హైదరాబాద్, డిసెంబర్11(నమస్తే తెలంగాణ): నిన్నటిదాకా రైతుల జీవితాలతో చెలగాటం ఆడిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయం తీసుకొని సింగరేణి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. దశలవారీగా ప్రైవేట్పరం చేసి యువతకు దక్కాల్సిన వారసత్వ ఉద్యోగాలను ఎత్తేసే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో బీజేపీని అడుగడుగునా ఎండగట్టడంలో సింగరేణి ప్రాంత యువత కీలకపాత్ర పోషించాలని సూచించారు.
బీజేపీపై కార్మికలోకం తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్షగట్టిందని ఆరోపించారు. తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణిని అమ్మేసేందుకు బాటలు వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంస్థను కాపాడుకొని తద్వారా రాష్ట్ర విద్యు త్తు అవసరాలు తీర్చుకోవాలన్న దూరదృష్టితో సీఎం కేసీఆర్ 2015లో తమకు అదనపు బ్లాకులు కావాలని కేంద్రానికి లేఖ రాస్తే పట్టించుకోలేదన్నారు. తాజాగా 4 బ్లాకులను వేలం వేస్తారని తెలిసిన వెంట నే వాటిని తమకు కేటాయించాలని సీఎం కేసీఆర్ ప్రధానికి మరో లేఖ రాశారని గుర్తుచేశారు.
సింగరేణి వేలాన్ని రద్దు చేయాలని 3 రోజులుగా సంస్థ కార్మికులు సమ్మె చేస్తున్నారని, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వేలాన్ని ఆపాలని డిమాండ్చేశారు. వేలం ఆపకపోతే బీజేపీ నేతలను తిరగనీయబోమని హెచ్చరించారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోరగానే లిగ్నైట్ బ్లాకులను కేటాయించిదని, కోల్ ఇండియాకు సంబంధించిన 118 బ్లాకులను అదే సంస్థకు కట్టబెట్టిందని చెప్పారు. ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు తమతమ రాష్ర్టాల్లో బ్లాకుల వేలాన్ని ఆపాలని కోరితే నిలిపివేశారన్నారు. తెలంగాణ ప్రభు త్వం వేలాన్ని ఆపాలని కేంద్రాన్ని కోరినా, ప్రధానికి లేఖ రాసినా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అదానీకి దశలవారీగా సింగరేణిని కట్టబెట్టాలన్న కుట్రపూరిత వైఖరిని కేంద్రం అనుసరిస్తున్నదని మండిపడ్డారు.
కేంద్రానికి రోజులు దగ్గర పడ్డాయి: ఎమ్మెల్యే జీవన్రెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు మెంబర్స్ ఆఫ్ ఫ్రాడ్ క్లబ్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీలు సింగరేణి వేలాన్ని ఆపించాలని డిమాండ్చేశారు. లేకుంటే వారిని కర్షకులు, కార్మికులు ఉరికించి కొడతారని హెచ్చరించారు. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక కుట్రలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. బీజేపీ పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణలో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.