న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని సుప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం పూజారులు ఆ రాష్ట్రమంత్రి ధన్సింగ్ రావత్పై మండిపడుతున్నారు. కోవిడ్-19 ప్రతిస్పందన శాఖను చూస్తున్న మంత్రి స్వయంగా లాక్ డౌన్ నిబందనలను అతిక్రమించి మందీమార్బలాన్ని వెంటపెట్టుకుని గుడికి రావడం ఏమిటని వారు విస్తుపోతున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రనే రద్దు చేసిన నేపథ్యంలో ఆదివారం మంత్రి తగుదునమ్మా అంటూ బద్రీనాథ్ దర్శనానికి రావడం సరికాదని పూజారులు పేర్కొన్నారు. మంత్రివెంట ఆయన అనుచరుల బృందం, అధికారులు పోలీసులు రవడంతో ఆలయం రద్దీగా తయారైంది. కోవిడ్ కల్లోలం మధ్యలో కుంభమేళా, తీర్థయాత్రల నిర్వహణపై హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసిన కొద్ది రోజుల్లోనే ఇది జరిగింది.