హైదరాబాద్, ఆట ప్రతినిధి: అనంత్ బజాజ్ స్మారక ‘బాయ్’ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో మిథున్, మాళవిక బన్సోద్ సింగిల్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. గురువారం పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మిథున్(రైల్వేస్) 21-15, 21-4 తేడాతో ఆదిత్య జోషిపై అలవోక విజయం సాధించాడు. మహిళల సింగిల్స్లో భారత ఎయిర్పోర్ట్ అథారిటీ(ఏఏఐ) ప్లేయర్ మాళవిక 21-15 , 21-9తో ఆకర్షి కశ్యప్పై గెలిచి ట్రోఫీ ఖాతాలో వేసుకుంది. పురుషుల డబుల్స్ తుదిపోరులో కృష్ణప్రసాద్, విష్ణువర్ధన్గౌడ్ జోడీ 21-9, 21-12తో రవికృష్ణ, శంకర్ప్రసాద్ ద్వయంపై గెలిచింది. మహిళల డబుల్స్ టైటిల్ను ఖుషి గుప్తా, సిమ్రన్ సింఘి జోడీ, మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, సంజన సంతోష్ జంట ట్రోఫీ కైవసం చేసుకుంది. పోటీల ముగింపు కార్యక్రమానికి సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ ముఖ్య అతిథులుగా హాజరై ట్రోఫీలు అందజేశారు.