మహబూబాబాద్, మార్చి 20: నాడు విద్యార్థుల్లేక మూతపడిన ఓ సర్కారు బడి మళ్లీ జీవం పోసుకొన్నది. విద్యార్థుల తల్లిదండ్రుల పట్టుదల, కలెక్టర్ చొరవతో సోమవారం ఆ బడి పునఃప్రారంభమైంది. కొవిడ్ కంటే ముందు మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు శ్రీరాంనగర్ బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు, 8 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఆ సమయంలో కాలనీవాసులు జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. విద్యార్థులు లేకపోవడంతో పాఠశాలను మూసివేశారు. కొవిడ్ సమయంలో వారందరూ సొంతకాలనీకి చేరుకొన్నారు. కొవిడ్ తగ్గుముఖం పట్టాక కొన్ని నెలల క్రితం ప్రభుత్వం విద్యాసంస్థలు తెరిచేందుకు అనుమతులు జారీచేసింది. ఇదే సమయంలో ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టడాన్ని గమనించిన కాలనీవాసులు.. ఎలాగైనా బడిని తెరిపించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని కాలనీకి చెందిన బీసీ సంక్షేమశాఖ జిల్లా అధ్యక్షుడు శంతన్ రామరాజుతో చెప్పారు. అందరూ కలిసి గత సోమవారం కలెక్టర్ శశాంకను కలిసి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ చొరవతో బడి పునఃప్రారంభమైంది. సోమవారం 25 మంది విద్యార్థులు హాజరుకాగా, మరో 10 మంది మూడు రోజుల్లో అడ్మిషన్ పొందుతారని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మహ్మద్ అలీఖాన్ అనే ఉపాధ్యాయుడిని కేటాయించారు. తమ విజ్ఞప్తికి స్పందించి పాఠశాలను తెరిపించిన కలెక్టర్కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.