హుజూరాబాద్, అక్టోబర్ 27 : తాను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన కాజీపేట-కరీంనగర్ రైల్వే లైన్ ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ నిర్లక్ష్యంతోనే రద్దయ్యిందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ మండిపడ్డారు. పార్లమెంట్లో ఒక్కసారి కూడా రైల్వేలైన్పై బండి మాట్లాడలేదని ఆరోపించారు. బుధవారం హుజూరాబాద్లో వినోద్కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎంపీగా అతను పట్టించుకోకున్నా, తాను మాత్రం ప్రయత్నిస్తానని స్పష్టంచేశారు. బావుపేట దగ్గర ఆర్వోబీ గురించి తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపాదన పెట్టానని, ప్రస్తుత ఎంపీ సంజయ్ దాని గురించి కూడా నోరు మెదపట్లేదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని, ఎవరూ ఆందోళన పడొద్దని సూచించారు. ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.