హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 11: దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 12న కార్మిక, రైతు, ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పీడీఎస్యూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని పీడీఎస్యూ రాష్ర్ట ఉపాధ్యక్షులు బి.నరసింహారావు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ బుధవారంలో పీడీఎస్యూ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారల చేతుల్లో కీలుబొమ్మగా మారి కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో కార్మికవర్గం తమ హక్కుల రక్షణ కోసం దశాబ్దాల క్రితం తమ రక్తం చిందించి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి వేసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నదన్నారు. సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరి మహేష్, వరంగల్-హన్మకొండ జిల్లా అధ్యక్షులు బోయినపల్లి అజయ్, కేయూ ప్రధాన కార్యదర్శి వి.కావ్య, ఉపాధ్యక్షులు పి.అనూష, సహాయ కార్యదర్శి గణేష్, జిల్లా కోశాధికారి షరీఫా, యాదగిరి, స్వాతి, హర్షీత, వంగేటి మోహన్, సుభాష్ చంద్రబోస్, యూనివర్సిటీ నాయకులు రాజేష్,రాంబాబు, కోటేశ్వర్ పాల్గొన్నారు