హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): కొన్ని వ్యాధులు పుట్టుకతో వస్తే మరణించేవరకు వెంటాడుతూనే ఉంటాయని, ఇలాంటి ప్రమాదకర వ్యాధుల పట్ల ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ ముత్యాల సుబ్బయ్య తెలిపారు. ‘వరల్డ్ రేర్ డిసీజెస్ డే’ను పురస్కరించుకొని ఇండియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ రేర్ డిసీజెస్ సోమవారం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జన్యు లోపాలతో కొన్ని వ్యాధులు పుట్టుకతోనే వస్తాయని, వీటికి మందులు కూడా అందుబాటులో ఉండవని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా 7వేల అరుదైన వ్యాధులను గుర్తించారని, వాటిలో 5 శాతం వ్యాధులకే మందులు ఉన్నాయని వెల్లడించారు. బిడ్డను కనేముందు దంపతులు జన్య పరీక్షలు చేయించుకొంటే పుట్టబోయే బిడ్డకు అరుదైన వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చని వివరించారు. పిల్లలు పుట్టిన తర్వాతైనా 24 గంటల్లో న్యూ బార్న్ స్క్రీనింగ్ చేయిస్తే జబ్బులు ఉన్నాయా? లేదా? అనేది తెలుసుకొనే వీలుంటుందని, తద్వారా జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ దంత వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.