హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తేతెలంగాణ): మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డు లభించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఆదివారం భువనేశ్వర్లో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫిషరీస్ డెవలప్మెంట్ (ఏఎన్ఎఫ్డీబీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా చేతుల మీదుగా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ఈ అవార్డును అందుకొన్నారు. రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి పొందుతున్న మత్స్య రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ చొరవతో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. దేశంలో ఎకడా లేనివిధంగా రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేశారు.
దీంతో 2014-15 నాటికి రాష్ట్రంలో 2.27 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి ప్రస్తుతం 3.37 లక్షల టన్నులకు పెరిగింది. అంతేకాకుండా దేశంలోనే నీటి వనరుల్లో ఉచితంగా రొయ్య పిల్లలను విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే. మరోవైపు వినియోగదారులకు చేపలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 150 రిటైల్ మొబైల్ ఫిష్ ఔట్లెట్లను ప్రారంభించడంతోపాటు రాష్ట్రంలోని నీటి నిల్వలను సమీక్షించేందుకు 30 వేల నీటి వనరులకు జియో ట్యాగింగ్ చేసిన ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. దేశంలో చేపల పెంపకందారుల సొసైటీలు తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో కేజ్ కల్చర్కు అనువుగా ఉన్న నీటి వనరుల్లో రూ.300 కోట్ల వ్యయంతో చేపల పెంపకం చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాష్ట్రంలోని మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యరంగం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని సహజ నీటి వనరుల్లో పెరుగుతున్న చేపలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో డిమాండ్ ఉన్నదని, మత్స్యశాఖలోని అధికారులు, సిబ్బంది కృషి వల్లనే రాష్ర్టానికి ఉత్తమ అవార్డు లభించిందని మంత్రి తలసాని పేర్కొన్నారు.