Aukus pact : దక్షిణ చైనా సముద్రంలో చైనాను కట్టడి చేసేందుకు ఆకస్ కూటమిలోని దేశాలు కీలక ముందడుగు వేయనున్నాయని నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ఆస్ట్రేలియా నౌకాదళానికి కీలకమైన అణుశక్తి సబ్మెరైన్ల తయారీ ఒప్పందంమైన ఆకస్ (Aukus) ను విస్తరించి దానిలోకి జపాన్ను కూడా తీసుకొనే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై చర్చలు మొదలుకానున్నట్లు తెలుస్తోంది.
అగ్రరాజ్యం అమెరికానే ఈ దిశగా చర్యలు ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ కూటమి కృత్రిమ మేథ, డ్రోన్లు, డీప్స్పేస్ రాడార్ల సాయంతో చైనాపై ఎల్లవేళలా నిఘా ఉంచే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆకస్ కూటమిలోని రక్షణ మంత్రులు సోమవారం బేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఒప్పందంలోని పిల్లర్-2ను బలోపేతం చేయడంపై ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.
పిల్లర్-2 కింద సభ్యదేశాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్, జలగర్భ, హైపర్సోనిక్ టెక్నాలజీ, కృత్రిమ మేథ, సైబర్ సాంకేతికను అభివృద్ధి చేయనున్నారు. ఇక ఈ ఒప్పందంలో మొదటి పిల్లర్ కింద ఆస్ట్రేలియాకు అణుశక్తి సబ్మెరైన్లు అందించనున్నారు. చైనాను కట్టడి చేయాలంటే టోక్యో ఈ కూటమిలోకి రావాలనే బలమైన వాదన ఉంది. అప్పుడే తైవాన్పై ఒకవేళ చైనా దాడిచేస్తే కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని జపాన్ మాజీ ప్రధాని టారో అసో పేర్కొన్నారు.
2023లో బ్రిటన్ ఫారెన్ అఫైర్స్ కమిటీ ఆకస్లోకి జపాన్, దక్షిణ కొరియాలను తీసుకోవాలని సూచించింది. జోబైడెన్ సర్కారు ఆసియాలోని జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు. కాగా ఈ కూటమి ఏర్పాటుపై చైనా ఇప్పటికే రుసరుసలాడుతోంది. ప్రాంతీయంగా ఆయుధ పోటీని ఈ ఒప్పందం ఎగదోస్తుందని వ్యాఖ్యానించింది.