సూర్యాపేట : తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లాలోని చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో మంత్రి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని రెండు వందల మంది ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ దేశంలోనే ఆదర్శ తెలంగాణగా మార్చాడని అన్నారు. తెలంగాణలో రైతులకు జరుగుతున్న మేలును దేశంలోని రైతులందరికీ అందించడానికి జాతీయస్థాయిలో బీఆర్ఎస్ను ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంపీపీ కుమారిబాబు,జడ్పీటీసీ సంజీవ, నాయకులు పాల్గొన్నారు.