ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో ఆ పార్టీ బుధవారం అల్టిమేటమ్ జారీ చేసింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసం వర్షాలో సాయంత్రం 5 గంటలకు జరిగే పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలంతా తప్పక హాజరవ్వాలని పేర్కొంది. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు విప్ జారీ చేసింది. ‘మీరు (శివసేన ఎమ్మెల్యేలు) పార్టీ సమావేశానికి హాజరు కాకపోతే, మీరు పార్టీ సభ్యత్వం నుండి వైదొలిగినట్లు పరిగణిస్తాం. ఫలితంగా సంబంధిత చట్టం, నిబంధనల ప్రకారం మీపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది’ అని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు ఒక లేఖలో హెచ్చరించారు.
కాగా, తిరుగుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తన వెంట 46 మంది ఎమ్మెల్యేలున్నారని ప్రకటించారు. అయితే ఆయనకు ఎంత మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారన్నది స్పష్టం కాలేదు. సోమవారం రాత్రి శివసేన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లోని సూరత్లో ఒక హోటల్కు వెళ్లిన ఏక్నాథ్ షిండే, బుధవారం వారితో కలిసి ప్రత్యేక విమానంలో బీజేపీ పాలిత మరో రాష్ట్రమైన అస్సాంకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాజకీయ చదరంగం ఆడుతున్నారు. మరోవైపు తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండేతో చర్చలు జరుపుతున్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.