కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి వెనుక లోతైన కుట్ర దాగుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. దీదీపై దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం తృణమూల్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) కలిసి ఫిర్యాదు చేశారు. మమతా బెనర్జీపై దాడికి కుట్ర పన్నారని దీనిపై ఉన్నతస్ధాయి దర్యాప్తు చేపట్టాలని ఆరుగురు టీఎంసీ నేతలతో కూడిన ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది.
దీదీపై దాడికి కుట్ర జరిగిందనేందుకు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో కూడిన ట్వీట్ను టీఎంసీ నేతలు ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. నందిగ్రామ్లో మమతా బెనర్జీ గాయపడటం దురదృష్టకర ఘటన కాదని, ఇది కచ్చితంగా కుట్రేనని ఆరుగురు పార్టీ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం ఈసీకి తెలిపింది. దేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడిన ఉదంతంపై అందరూ ఆందోళన చెందినా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నుంచి ఇప్పటివరకూ ఒక్క ప్రకటన రాలేదని టీఎంసీ నేత పార్థ ఛటర్జీ విమర్శించారు.