తుక్స్ట్లా గుజేరజ్ (మెక్సికో): మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులను అక్రమంగా తరలిస్తున్న ఓ కంటెయినర్ లారీ బోల్తా పడి పక్కనే ఉన్న నడకదారుల బ్రిడ్జీని బలంగా ఢీకొంది. దీంతో కంటెయినర్లో ప్రయాణిస్తున్న 107 మందిలో 53 మంది మరణించారు. మరో 54 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన గురువారం దక్షిణ మెక్సికోలోని ఓ హైవేపై చోటుచేసుకుంది. సెంట్రల్ అమెరికా, గ్వాటెమాలాకు చెందిన వలసదారులు కంటెయినర్లో చియాపాస్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. లారీలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటం, అతివేగంగా వెళ్లడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నది.