‘వారసత్వం’ అంటే ఆస్తి, పేరు ప్రతిష్టలను అనుభవించడం కాదు, దానివెనుక ఉన్న బాధ్యతలను మోయడం. దాని పేరు ప్రఖ్యాతులను మరింతగా పెంపొందించడం. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. కేసీఆర్ కుటుంబం అనగానే తెలంగాణ చెట్టు మీద వచ్చి వాలే పక్షుల్లాగ ఆయన పిల్లల్ని జమకడ్తాయి విపక్షాలు. విడ్డూరమేమంటే… అది అవాస్తవమనే విషయం విపక్షాలకూ తెలుసు.
కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు కేటీఆర్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చదువు పూర్తిచేసుకొని, ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలనే ఆకాంక్షతో స్వదేశానికి తిరిగివచ్చారు. తెలంగాణ ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ చరిత్ర తెలుసుకున్నారు. ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ అవగాహనే ఆయనలో రాజకీయాసక్తిని పెంచింది తప్ప తండ్రి రాజకీయ నేపథ్యాన్ని వారసత్వంగా భావించి కాదు. నిజానికి కేటీఆర్ చేపట్టిన మంత్రిత్వ శాఖల్లో ఆయన తీసుకువస్తున్న సంస్కరణల జోరు చూస్తే ఆయనది వారసత్వ రాజకీయ నేపథ్యం అని ఎవ్వరూ అనరు. చిన్న వయసు, అనర్గళంగా మాట్లాడే శక్తి, సమస్యల మీద అవగాహన, పెక్కు అనుభవం.. ఇవన్నీ కేటీఆర్ను ఎదురులేని నాయకుడిగా నిలబెడుతున్నాయి. మన దేశ రాజకీయ చిత్రమెప్పుడూ యువ నాయకత్వపు ఫ్రేమ్ను చూడలేదు. ప్రస్తుత రాజకీయమూ అలాంటి వాతావరణంతో లేదు. వేళ్ల మీద లెక్కపెట్టదగ్గ యువ నాయకులే ఉన్నారు మన దగ్గర. వాళ్లలో కేటీఆర్ ఒకరు. ప్రస్తుతం మన దేశ జనాభాలో యువతదే అగ్రస్థానం.
వేగంగా పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకోగలిగే అంత చురుకైన నాయకుడిగా కేటీఆర్ ప్రజల మన్ననను చూరగొంటున్నారు. యువత ఆలోచనలకు తగ్గట్టుగా తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల్లో మార్పులను తీసుకువస్తున్నారు. ముఖ్యం గా ఐటీరంగంలో విదేశీ పెట్టుబడులు వరదలా వచ్చేందుకు కృషిచేస్తున్నారు. ఈ రంగంలో ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. ఐటీరంగాన్ని దేశంలోనే ముందువరుసలో నిలిపేందుకు కేటీఆర్ ఎనలేని కృషిచేస్తున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోని ఇతర రాష్ర్టాలతో కాదు, ప్రపంచంలోని ఇతర దేశాలతో సమం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని ఐటీ సాధిస్తున్న ప్రగతే దీనికి తాజా ఉదాహరణ.
2015లో ‘టీ-హబ్’ను స్థాపించారు. యువ పారిశ్రామికవేత్తలతో ఎనలేని ప్రగతితో ముందుకు సాగుతున్నారు. 2017లో ‘వీ-హబ్’ను స్థాపించి ప్రపంచస్థాయి సంస్థలతో మహిళా పారిశ్రామికవేత్తలను అనుసంధానం చేశారు. ఆ రంగంలో వస్తున్న పెట్టుబడులే దీనికి సజీవ సాక్ష్యం. 2021-22 వరకు 18,761 పారిశ్రామిక అనుమతులిచ్చారు. రూ.2.28.808 కోట్ల పెట్టుబడులు తెచ్చారు. 16.32 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
అంతేకాదు, పారిశ్రామికంగానూ, తెలంగాణ సాధిస్తున్న వృద్ధి.. ఈ రోజుల్లో దేశంలోనే ఏ రాష్ట్రమూ సాధించడం లేదు. సాంకేతికాభివృద్ధి కొలమానమూ మనకు ప్రపంచ దిక్సూచే. టెక్నాలజీతో కనెక్టయి ఉన్న యువతకు అదే టెక్నాలజీతో పెట్టుబడులను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను పెంచి వాళ్ల జీవన ప్రమాణాలను సరిచేసి సమాధానం చెప్తున్నారు. 24 గంటలూ సోషల్ మీడియాలో కనిపించే యువతను అదే వేదికగా చేసుకొని కలుస్తున్నారు. వాళ్ల సమస్యలు తన దృష్టికి వచ్చేందుకు ఆ ప్లాట్ఫామ్నే వాళ్లకు కన్వీనియెంట్గా మలుస్తున్నారు. ట్విటర్లో అందుబాటులో ఉంటూ.. వాళ్ల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఒక్క ప్రజలతోనే కాదు, తన ఆధ్వర్యంలోని ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను తెలుసుకొంటూ సత్వరమే పరిష్కరిస్తున్నారు. ఉద్యోగులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ‘లెస్ కాంటాక్ట్.. మోర్ వర్క్’ పంథాలో చాలావరకు ఆన్లైన్లోనే ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా పరిపాలనా సౌకర్యాలను తీసుకువచ్చారు.
ఫ్రెండ్లీ గవర్నెన్స్ను అవలంబించేలా చూస్తున్నారు. దీనివల్ల సమయం కలసిరావడంతో పాటు వనరుల వృథాను నివారించగలుగుతున్నారు. ఇలా తన పరిధిలో ఉన్న రంగంలోనైనా తన ఇంటికోసం.. కుటుంబం కోసం ఆలోచిస్తే ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తారో.. అంతే జాగ్రత్తగా ప్రణాళికతో రాష్ట్ర భవిష్యత్ను నిర్మించేందుకు యువ మంత్రి కేటీఆర్ సన్నాహాలు చేస్తున్నారు.
నేడు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్న సందర్భంలో రాష్ర్టానికి కేసీఆర్ను మరిపించే నాయకుడు కేటీఆర్ అయ్యారు. ఆయన అడుగుజాడల్లో… తండ్రి కన్నా గొప్ప దూరదృష్టితో కేసీఆర్ స్థానంలో కేటీఆర్ కనిపిస్తున్నారు. పార్టీలో ఎక్కడా అసంతృప్తి లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకుసాగుతున్న నేపథ్యం, పార్టీ వ్యూహాలు.. ఎలక్షనీరింగ్ లో అతని వయసు సరిపోతుందా? అవతల కాకలుతీరిన పార్టీలున్నాయి కదా అని సందేహపడుతున్నవారు 2019 సాధార ణ ఎన్నికలు, తర్వాత మన రాష్ట్రంలో జరిగిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు వం టి ఉప ఎన్నికల్లోనూ, హైదరాబాద్ నగరపాలక ఎన్నికల్లోనూ తను బాధ్యతలు తీసుకొని, అనుభవం కలిగిన రాజకీయవేత్తగా అడుగులు వేయడాన్ని గమనించాలి. తనదైన వ్యూహరచనతో, ప్రచారంతో యువతను చైతన్యం చేసి, సమర్థవంతమైన యువనాయకత్వం సత్తాను చాటారు కేటీఆర్.
విజయాలతో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే జవాబు చెప్పి, టీఆర్ఎస్ను విజేతగా నిలబెట్టారు కేటీఆర్. అలా ఆ సమయంలో తన మీద పెట్టుకున్న పార్టీ నమ్మకాన్ని కానీ, ప్రజల నమ్మకాన్ని కానీ వమ్ము చేయలేదు. పైగా వాళ్లు ఊహించినదానికన్నా ఎక్కువ సమర్థతనే చాటుకున్నారు. నిఖార్సయిన నాయకుడిగా నిలబడ్డారు కేటీఆర్. కాబట్టి.. బీఆర్ఎస్ తరఫున రేపటి ఎన్నికల్లో కేసీఆర్ దేశవ్యాప్తంగా విజయశంఖారావం పూరిస్తే.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించడంలో కేటీఆర్ ముందుంటారనడంలో సందేహం లేదు.
దీంతోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర అధినేతగా పార్టీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషిచేసి మరో యాభై ఏండ్ల పాటు బీఆర్ఎస్ అధికార పీఠంపై నిలిపేందుకు కేటీఆర్ సమర్థత, ప్రావీణ్యత, పారదర్శకత, పట్టుదల గల శక్తిగా నిలుస్తారన్నది అక్షర సత్యం.
గొప్ప దూరదృష్టి, దార్శనికతతో కేసీఆర్ స్థానంలో కేటీఆర్ కనిపిస్తున్నారు. పార్టీలో ఎక్కడా అసంతృప్తి లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకుసాగుతున్న నేపథ్యం, పార్టీ వ్యూహాలు.. ఎలక్షనీరింగ్లో అతని వయసు సరిపోతుందా? అవతల కాకలుతీరిన పార్టీలున్నాయి కదా అని సందేహపడుతున్నవారు 2019 సాధారణ ఎన్నికలు, తర్వాత మన రాష్ట్రంలో జరిగిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు వంటి ఉప ఎన్నికల్లోనూ, హైదరాబాద్ నగరపాలక ఎన్నికల్లోనూ తను బాధ్యతలు తీసుకొని, అనుభవం కలిగిన రాజకీయవేత్తగా అడుగులు వేయడాన్ని గమనించాలి.
(వ్యాసకర్త: మాజీ ప్రధాన సమాచార కమిషనర్, ఉమ్మడి ఏపీ)
డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు: 92465 26899