బాన్సువాడ : రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని వంద పడకల మాతా, శిశు దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో గర్భిణులు, బాలింతలతో మాట్లాడి వసతులు, వైద్యారోగ్య సేవలను అడిగితెలుసుకున్నారు. అనంతరం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డితో మాట్లాడారు. డాక్టర్లు, సిబ్బంది కొరత ఉందని వివరించగా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షంతో కూలిన ఇండ్లకు బదులుగా ప్రభుత్వ ఇండ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
కాలనీలో రోడ్ల పరిశుభ్రతను పరిశీలించారు. కల్కిచెరువకు కట్టను సందర్శించి కట్టపై నిర్మిస్తున్న బోటింగ్ పాయింట్ను, పనులను పరిశీలించారు. నీటి పారుదల శాఖ డీఈ శ్రావన్ కుమార్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకొని, పలు సూచనలు చేశారు. పట్టణానికి చెందిన భూదవ్వ అనే మహిళ తన భర్త కరోనాతో చనిపోయాడని తనను ఆదుకోవాలని విన్నవించుకోగా తక్షణమే 5వేల రూపాయలను అందజేశారు. ఆమెకు వృద్ధాప్య పింఛన్తో పాటు వ్యక్తిగతంగా ప్రతి నెలా రెండువేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించారు. స్పీకర్ వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ రమేశ్ , కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.