హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధికారులను కోరారు. ఈ నెల 7 నుంచి ఉభయసభలు సమావేశం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభ్కార్, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ సోమవారం నుంచి రాష్ట్ర రెండో శాసనసభ 8వ సమావేశాలు, శాసనమండలి 18వ సమావేశాలు పునఃప్రారంభమవుతున్నాయని చెప్పారు.
సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందివ్వాలని అధికారులను ఆదేశించారు. గత సమావేశాలకు సంబంధించిన పెండింగులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు వెంటనే పంపించాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అర్వింద్కుమార్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్, డీఎంఈ రమేశ్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, డీజీపీ ఎం మహేందర్రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, ట్రైసిటీ పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగత్, ఇంటెలిజెన్స్ డీఐజీ శివకుమార్, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారం భం కానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభం రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. శాసనసభ, శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టేముందు దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్పై సమీక్షించి అవసరమైన సూచనలు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికేవివిధ శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లిన విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాల నిర్వహణ, వివిధ రంగాల్లో సర్కార్ సాధించిన ప్రగతి, సభ్యు లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం.