సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): లిఫ్ట్ అడిగి..అసభ్యకరంగా ప్రవర్తించి.. బంగారు గొలుసులను తస్కరిస్తున్న బెంగళూరుకు చెందిన ట్రాన్స్జెండర్, ఆమెకు సహకరిస్తున్న మరో వ్యక్తిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. ట్రాన్స్జెండర్ అంజుమ్, ఆమెకు సహకరిస్తున్న బస్వరాజ్ ఈ నెల 12న విమానంలో బెంగళూర్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. సికింద్రాబాద్ ప్రాంతంలో వినాయక లాడ్జిలో గదిని తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం అంజుమ్ సికింద్రాబాద్లో కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగి ఎక్కింది. అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతడు సీటీవో జంక్షన్ వద్ద కారును ఆపేశాడు. అతడి మెడలోని బంగారు గొలుసు, ల్యాప్టాప్ తీసుకొని పరారైంది. బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గంట వ్యవధిలోనే పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కానిస్టేబుల్ను లిఫ్ట్ అడిగి..అదే విధంగా ప్రవర్తించి.. అతడి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోయింది. బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేపట్టారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం మహంకాళి పోలీసులతో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించి.. నిందితులను గుర్తించారు. వినాయక లాడ్జి సమీపంలో ఇద్దరిని పట్టుకున్నారు. దొంగిలించిన బంగారాన్ని బస్వరాజ్కు అప్పగిస్తుండడంతో అతడు వాటిని విక్రయిస్తుంటాడని విచారణలో తేలింది.