హైదరాబాద్ : నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టే అవకాశం ఉంది. బస్సుల తయారీకి టీఎస్ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించగా.. అశోక్ లేలాండ్ సంస్థ టెండర్ దాఖలు చేసింది. తొలిదశ 25 బస్సులు కావాలని టీఎస్ ఆర్టీసీ కోరింది. దీంతో బస్సులను సమకూర్చేందుకు లేలాండ్ సంస్థ ముందుకు వచ్చింది. డబుల్ డెక్కర్ బస్సుల టెండర్పై త్వరలో ఆర్థిక కమిటీ చర్చించనున్నది. ఈ కమిటీ ఆమోదముద్ర వేసిన వెంటనే సదరు సంస్థ బస్సులను సమకూర్చనుంది.
నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టాలంటూ ఇటీవల మంత్రి కేటీఆర్కు ఓ పౌరుడు ట్విట్టర్లో విజ్ఙప్తి చేశాడు. ఈ అంశాన్ని పరిశీలించాలని ఆర్టీసీ అధికారులను మంత్రి కోరారు. వెంటనే స్పందించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం టెండర్లను ఆహ్వానించారు. గతంలోనూ నగరంలోని పలు ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టిన విషయం తెలిసిందే.