న్యూఢిల్లీ : నాలుగేండ్ల తర్వాత మోదీ ఇంటిపేరు కేసును తిరిగి తెరవడం కుట్రపూరితమని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) మోదీ నేతృత్వంలోని కాషాయ సర్కార్పై మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో దిక్కుతోచని బీజేపీ మోదీ ఇంటిపేరు కేసును తిరిగి తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు.
నాలుగేండ్ల కిందటి కేసును తిరగతోడటం కుట్రపూరితం కాక మరేమిటని గెహ్లాట్ ప్రశ్నించారు. మోదీ ఇంటిపేరు కేసులో దోషిగా నిర్ధారిస్తూ వెలువరించిన తీర్పుపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించిన నేపధ్యంలో రాజస్దాన్ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్ను నిలదీసే విపక్ష నేతలను కేంద్ర ప్రభుత్వం వేధించడమే పనిగా పెట్టుకుందని అన్నారు.
రాహుల్ దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి. విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ సహా కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఉసిగొల్పి మోదీ సర్కార్ వేధిస్తోందని పలు పార్టీల నేతలు విరుచుకుపడ్డారు. కాగా రాజస్దాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని అశోక్ గెహ్లాట్ పిలుపు ఇచ్చారు. పార్టీకి నష్టం కలిగించే పనులను చేపట్టవద్దని కోరారు.
Read More