New Twist in Bharat Pe | భారత్పే సహ-వ్యవస్థాపకుడు అశ్నీర్ గ్రోవర్ వివాదం మరో మలుపు తిరిగింది. సంస్థ సీఈవో సుహైల్ సమీర్ను భారత్పే బోర్డు సీఈవోగా తప్పించాలని బోర్డు సభ్యులకు లేఖ రాశారు. దీనికి గ్రోవర్తోపాటు మరో సహ వ్యవస్థాపకుడు శాశ్వత్ మాన్సుఖ్ భాయి నక్రానీ మద్దతు తెలిపారు. సంస్థ నిబంధనల ప్రకారం సీఈవోగా సుహైల్ నామినేషన్ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు గ్రోవర్ ఈ నెల 2న రాసిన లేఖలో పేర్కొన్నారు. గమ్మతేమిటంటే 2020లో సుహైల్ సమీర్ను గ్రోవర్ నియమించారు. గతేడాది ఆగస్టు 20వ తేదీన సుహైల్ను సీఈవోగా గ్రోవర్తోపాటు నక్రానీ నామినేట్ చేశారు. అదే టైంలో గ్రోవర్ ఎండీగా నియమితులయ్యారు.
ఇవీ భారత్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
భారత్ పే వాటాదారుల ఒప్పందం ప్రకారం సంస్థ బోర్డు డైరెక్టర్గా ప్రతి ఒక్కరికి డైరెక్టర్ నియామక హక్కు ఉంటుంది. వాటాదారులు తమకు బదులు మరో వ్యక్తిని డైరెక్టర్గా నియమించొచ్చు. అయితే, మెజారిటీ ఇన్వెస్టర్ల మద్దతు ఉండాలి. తనపై భారత్ పే బోర్డు కార్పొరేట్ బెదిరింపులకు పాల్పడుతున్నదని గ్రోవర్ ఆరోపించారు. కంపెనీ బోర్డు నుంచి గ్రోవర్ను సాగనంపేందుకే సంస్థ బోర్డు.. ఢిల్లీ కేంద్రం పని చేస్తున్న కరంజావాలా అండ్ కోను నియమించిందని ఇంతకుముందు వార్తలొచ్చాయి.
వివాదాస్పద ఆడియో క్లిప్పై ఇలా
కొటక్ వెల్త్ ఎగ్జిక్యూటివ్తో తాను మాట్లాడినట్లు భారత్పే బోర్డు చేస్తున్న వాదన తప్పని గ్రోవర్ ఆరోపించారు. తనను భయపెట్టడానికే కొటక్ వెల్త్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడిన ఆడియోను లీక్ చేశారని. అది ఇప్పటికీ బూటకం అని వాదించారు. సాధారణంగా ఏదైనా వ్యక్తి ఒక వివాదంలో చిక్కుకుంటే మొత్తం బోర్డు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. నేను రికార్డు టైంలో బిజినెస్ సృష్టించారు. ఈ నాడు భారత్ పే సంపద 600 కోట్ల డాలర్లు. దీని ప్రకారం ప్రతి వాటాదారు వాటా 50 లక్షల డాలర్లు ఉంటుంది. కనుక బోర్డు వాటాదారుల పెట్టుబడి విలువకు అనుగుణంగా స్పందించాల్సి ఉంది అని గ్రోవర్ వ్యాఖ్యానించారు.
నిష్పక్షపాత విచారణకు సిద్ధం అన్న గ్రోవర్
తన వ్యక్తిగత సంపద ఎంత ఉందన్న సంగతి తెరిచిన పుస్తకం. భారత చట్టాలకు లోబడి నిష్పక్షపాత విచారణకు తాను సిద్ధం అని చెప్పారు. కానీ ఎవరైనా తనను బోర్డు నుంచి వెళ్లాలని కోరుకుంటే, అందులో భాగస్వామిని కాబోనని గ్రోవర్ చెప్పుకొచ్చారు. కానీ భారత్ పేలో ఆర్థిక అవకతవకలు, నియామకాలు, సంస్థతో అనుసంధానం కానీ వెండర్లకు చెల్లింపులు జరిగాయని అల్వరెజ్ అండ్ మార్షల్ (ఏ అండ్ ఎం) ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కన్సల్టెంట్ల ద్వారా నియామకాలు?
ఉద్యోగుల నియమించుకోవడానికి భారత్ పే కొన్ని కన్సల్టెంట్ సంస్థలకు రిక్రూట్మెంట్ ఫీజు చెల్లించిందని ఏ అండ్ ఎం గత నెల 24న తెలిపింది. ఐదుగురు ఉద్యోగులు మాత్రం ఉద్యోగంలో తాము చేరిన తేదీని ధృవీకరిస్తున్నారని, కానీ కన్సల్టెంట్ ద్వారా నియమితులం కాలేదని చెబుతున్నారు. భారత్ పే ఎండీ గ్రోవర్ సతీమణి మాధురి జైన్ ముగ్గురు ఉద్యోగుల నియామకంపై ఇన్వాయిస్లు అందుకుని, వాటి చెల్లింపులు చేయాలని సంబంధిత చెల్లింపుల విభాగానికి పంపారని దర్యాప్తులో తేలింది. ఇదే చిరునామా నుంచి సక్రమంగా లేని ఇన్వాయిస్లు వచ్చాయని ఏ అండ్ ఎం దర్యాప్తులో తేలింది. వారందరికీ పానీపట్తో సంబంధం ఉందని, మాధురి గ్రోవర్ కూడా అక్కడి వారేనని ఈ దర్యాప్తు తేల్చింది.