ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణపై రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు ఎక్కువవుతున్నది. రాష్ట్రం రావటం కోసం గాని, అభివృద్ధి కోసం గాని తాము ఇంతకాలం చేసిందేమీ లేకపోయినా అధికార కాంక్షతో వాటికి ఇప్పుడు కాలు నిలవటం లేదు. ఎంతటి పచ్చి అబద్ధాలనైనా లజ్జ లేకుండా ప్రచారం చేసి ప్రజలను గందరగోళపరచటమే ఇప్పుడు వారి వ్యూహమైనట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ విధంగా ఈ ఆదివారం నాడు రెండు రాబందులు సిరిసిల్లలోని ఒక కుటుంబం వద్దకు వెళ్లి దొంగ పరామర్శలు చేయటం ఇందుకు తాజా ఉదాహరణ. ఇటువంటివి ఇంకా చాలా జరుగుతాయి. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
సిరిసిల్లలో నవీన్ అనే యువకుని ఆత్మహత్య గురించి స్వయంగా నవీన్ తల్లిదండ్రులు చెప్తున్నదేమిటి? ‘తను గ్రూప్-1 పరీక్షకు అసలు దరఖాస్తే చేయలేదు. అటువంటప్పుడు పేపర్ లీకేజీతో సంబంధమే లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఆలోచనతో ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెగ్యులర్ డిగ్రీ లేదు గనుక పెద్ద ఉద్యోగాలు రావన్న మథనతో ప్రాణం తీసుకున్నాడు. తమ కుటుంబానికి యథాతథంగా ఆర్థిక సమస్యలేవీ లేవు’ – ఇవి నవీన్ తండ్రి స్వయంగా అందరి ముందు చెప్పిన విషయాలు.
కానీ, మన రాజకీయ రాబందులు ఆ రెండింటికి ఇది నచ్చలేదు. ఎందుకంటే వాటికి ఈ వాస్తవాలు అధికారం కోసం ఉపయోగపడవు. కనుక, తమ తెలివిని, చాతుర్యాన్ని ఉపయోగించి అవే వంకర విమర్శలు, ఆరోపణలు మరో రూపంలో చేస్తారు. అసలే దుఃఖంలో ఉన్న తమ కుటుంబాన్ని ఇటువంటి మాటలతో మరింత దుఃఖపెట్టవద్దని కూడా నవీన్ తల్లిదండ్రులు చేతులు జోడించి మరీ వేడుకున్నారు. కనీసం అది చూసి, జ్ఞానోదయం కలగకున్నా మానవత్వంతో కనికరం కలగాలి. కానీ, ‘అధికారం… అధికారం..’ అంటూ తపించిపోతున్న మన రాబందులకు అవేమీ కలగలేదు. రక్తదాహం ఎంతటిదో అధికార దాహం అంతటిది మరి.
ఇందులో నవ్వు కూడా తెప్పిస్తున్న విశేషం ఒకటున్నది. ఈ పరామర్శదారుల్లో షర్మిల అనే మనిషి ఒకరున్నారు. ఆమె తాను తెలంగాణ వాసినని, ఇక్కడి బిడ్డను, కోడలినని పదే పదే చెప్పుకొంటారు. కనుక తానిక్కడ రాజకీయం చేసేందుకు, అధికారానికి వచ్చేందుకు అన్ని హక్కులున్నాయని వాదిస్తారు. సాంకేతికంగా చూసినప్పుడు ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ, కొన్ని సూటి ప్రశ్నలను ఎందరు ఎన్నిసార్లు వేసినా ఆమె వాటికి అంతే సూటిగా, నిజాయితీగా సమాధానాలివ్వటం లేదు. వంకర టింకరగా మాట్లాడి అసలు విషయం నుంచి తప్పించుకుంటున్నారు. ఎందువల్ల? నిజాలు ఒప్పుకునే నిజాయితీ, ధైర్యం లేకనా? తెలంగాణ ప్రజలను బుకాయింపులతో కళ్లు గప్పగలననే అహంభావం చేతనా?
సందర్భం వచ్చింది గనుక మళ్లీ ఒకసారి అడుగుదాం. వీటిలో కొన్ని వాస్తవాలు తెలియని సందేహాలు గనుక, వాస్తవాలేమిటో షర్మిల ప్రజలకు వెల్లడించాలి. కొన్ని రాజకీయ ప్రశ్నలు అయినందున వాటికి సూటిగా జవాబు చెప్పాలి. మనకు తెలియనివి ఇవి. తన ఆధార్ కార్డులపై మొదటినుంచి ఇప్పటివరకు గల అడ్రసులేమిటి? ఓటరుగా తన పేరు మొదటినుంచి ఇంతవరకు ఏ ఊరి జాబితాలో ఉంది? తను తెలంగాణ బిడ్డ అయితే ఉద్యమకాలంలో (2000-14) తన వైఖరి, పాత్ర ఏమిటి? వందల మంది ప్రాణత్యాగాలు చేస్తుండగా ఆమె ఏమి మాట్లాడారు, ఏమి చేశారు? తన తండ్రి ఉద్యమాన్ని అణచివేస్తుంటే ఏ వైఖరి తీసుకున్నారు, అందుకు గల ఆధారాలేమిటి? ఓదార్పులకు, ఓదార్పు యాత్రలకు పేరు పొందిన తను, ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన కార్యక్రమాలు, యాత్రలు, రికార్డులు ఏమైనా ఉన్నాయా? తన తండ్రి ‘ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా’ కాంగ్రెస్ శాసనసభ్యులను ఢిల్లీకి ఒక డాక్యుమెంటుతో పంపినట్లు ఒక సందర్భంలో చెప్పినట్లున్నారు. అది నిజమైతే ఆ డాక్యుమెంటును తీసి, అందులో ఈ మద్దతు మాట ఎక్కడుందో చూపగలరా? వాస్తవానికి ప్రత్యేక తెలంగాణను తన తండ్రి, సోదరుడు బహిరంగంగా వ్యతిరేకిస్తుండగా ఆమె ఏ వైఖరి తీసుకున్నారు? తన మాటలేమిటి, చేతలేమిటి? నీతి నిజాయితీలు ఉంటే వీటన్నింటిపై శ్వేతపత్రం తేవాలి. శ్వేతపత్రాలపై మనకు ఆసక్తి ఏమి లేదు. కానీ, తనకు మోజున్నది గనుక ఆ పనిచేసినట్లయితే బాగుంటుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొన్నేండ్ల వరకు తెలంగాణ రాజకీయాలలో లేని ఆసక్తి షర్మిలకు
ఇటీవల ఉన్నట్లుండి కలిగింది. ఎందుకో ఆమె ఎప్పుడూ వివరించినట్టు లేరు. ఆ విషయమై పలు ఊహాగానాలున్నాయి. అవన్నీ వింటున్నవే గనుక ఇక్కడ ప్రస్తావించనక్కరలేదు.
తను అధికారాన్నో, లేక రాజకీయ ప్రాముఖ్యతనో, లేక మరిన్ని సంపదలలో మరింత భాగస్వామ్యాన్ని కోరుకోవటమో, వీటికి వేటికీ ఆంధ్రప్రదేశ్లో వీలుకాకపోవటమో, లేక తెలంగాణలో అధికారంతో పాటు ఇక్కడ గణనీయంగా పెరుగుతున్న సిరిసంపదలతో వీలైనంత సంపాదించుకోవచ్చుననే ఆశలో ఏవైనా కావచ్చు. ఏవైనప్పటికీ తను సక్రమ రాజకీయాలు, సక్రమ కార్యకలాపాల ద్వారా ప్రజలను మెప్పించి ఏమి సాధించుకున్నప్పటికీ ఎవరూ అభ్యంతర పెట్టే వీలు లేదు.
సమస్యల్లా నిజాయితీ లేనితనంతో, అబద్ధాలు బుకాయింపులతో వస్తున్నది. మాట్లాడితే ‘నేను ఆడబిడ్డను’ అంటూ ఆడతనం మాటున ఏమి మాట్లాడినా చేసినా చెల్లుబాటు అవుతుందనుకోవటంలో వస్తున్నది. ఇది అతి తెలివితో ఆడతనాన్ని రెండంచుల కత్తి వలె స్వార్థానికి ఉపయోగించుకోవటమవుతుంది. షర్మిల ఇవన్నీ చేస్తున్నారు. వాస్తవానికి తను ఒక బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన విద్యావంతురాలు, సంపన్నురాలు, వక్రంగా పరిణమిస్తున్నప్పటికీ కొంత తెలివంటూ ఉన్న మనిషి అయినప్పుడు, తాము అనేక ద్రోహాలు చేసి దోచుకున్నప్పటికీ సరైన రాజకీయాలు చేసి ఉంటే తనకు కొంత చోటు లభించి ఉండేదేమో. ప్రజలు ఎప్పుడూ ఉదార స్వభావులే. తన గతం ఏమిటని గాని, మీ రాయలసీమ ఇంత దారుణంగా వెనుకబడి ఆక్రోశిస్తున్నప్పుడు, ఎంతో దయగల అక్కా నా కోసం పోరాడమని అభ్యర్థిస్తున్నప్పుడు, నీ నేలను కాలదన్ని మరొక భూమిని కాలదొక్కే పెత్తందారీ పొగ రు, దోపిడీదారు దురాశ ఎందుకని గాని ఆ ఉదార స్వభావులు బహుశా, కనీసం ఈ తొలిదశలో ప్రశ్నించకపోవచ్చు. కానీ, షర్మిల అట్లా కాదు.
మొదట జనసంఘ్, తర్వాత బీజేపీ ఈ దేశంలో, తెలుగు భూమిలో ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ ఇంతటి అధికార దాహం, అధికార దుర్వినియోగం, హీనమైన వ్యవహరణ, కుసంస్కారం, కుట్రపూరిత తత్వం, దుష్టమైన భాష, రోత కలిగించే అసభ్యత, భారతీయతకూ, హిందూ మతానికీ మచ్చలు తెచ్చే వికృత సంస్కృతి గతంలో ఎన్నడూ లేవు. దీనంతటికి రూపుదిద్దిన ప్రతీకగా బండి సంజయ్ అనే రాబందు ఒకటి రెక్కలు అల్లార్చుకుంటూ తెలంగాణపై వేట కోసం ముసురుతున్నది.
తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రవేశమే అబద్ధాలతో, జుగుప్సాకరమైన అహంకారంతో మొదలైంది. ఆ విధంగా పుట్టుకే రాబందు పుట్టుక అయింది. తన మొట్టమొదటి కార్యక్రమం ఇందిరా పార్కు దగ్గర ధర్నాతో మొదలైనప్పుడు అనేక అబద్ధాలు అలవోకగా ఆడారు. నిబంధనలకు విరుద్ధంగా ట్యాంక్బండ్ వైపు వెళ్లకుండా పోలీసులు ఆపగా, ‘ఎప్పటికైనా అధికారంలోకి వచ్చి మీ (కేసీఆర్) అంతుజూస్తా’నని గొంతు చించుకుంటూ ఫాక్షనిస్టు శపథాలు చేసి తెలంగాణను మొదటనే విస్మయపరిచారు. సరిగా ఇదే తరహా అసత్యాలు, అహంభావ ధోరణి, నోటి దురుసు మాటలు, కోర్టులు హెచ్చరించినా మారని తీరు, అపరిపక్వత, అసభ్యత ఈ నాటికీ కొనసాగుతున్నాయి. ఇందుకు ఉదాహరణలు కుప్పలుతెప్పలు. ఎన్ని నెలలు గడిచినా ఆమెకు పరిపక్వత రావటం లేదు, జ్ఞానోదయం కలగటం లేదు. అధికార దాహం, మితిమీరిన అహంకారం జ్ఞానేంద్రియాలను కప్పివేసిన మనిషికి ఇట్లా జరగటం సహజం. ఆదివారం నాటి సిరిసిల్ల ఉదంతం అందుకు కొనసాగింపు మాత్రమే. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆదివారం నాటి సిరిసిల్ల సందర్భాన్ని చూసినప్పుడు కాంగ్రెస్ నాయకుడు జీవన్రెడ్డి రాజకీయం షర్మిలకు భిన్నంగా లేదు. ఆయన తెలంగాణకు చెందిన సీనియర్. తెలివి, అనుభవం గల వానిగా పేరున్నది. కానీ అధికార విరహవేదనను తక్కిన సహచరుల వలె ఆయన కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆ వివశతతో తనకు తెలియకుండానే కావచ్చు రూపాంతరం చెంది రాబందు రాజకీయానికి తలపడుతున్నారు.
ఇప్పటికే పదేండ్లుగా అధికారం లేదు. ఈసారి అయినా ‘ఏదో ఒకటి చేసి’ సాధించక మరొక ఐదేండ్లు చేజారితే తర్వాత జీవితమేమిటో ఎవరికి తెలిసేను. అందువల్ల రాబందుగానైనా సరే రూపాంతరం చెందవలసిందే.తన పార్టీకి చెందిన తక్కిన అధికార విరహవేదనాశీలురతో పాటు.
సమస్య ఏమంటే, తెలంగాణ పట్ల జీవన్రెడ్డితో సహా వీరంతా మొదటి నుంచి నిజాయితీలేని ద్రోహులే. వీరి ముందుతరం వారు తెలంగాణను సీమాంధ్ర ధనిక వర్గాలకు, రాజకీయ పెత్తందార్లకు అప్పగించి ఊడిగాలు చేయగా, వీరు ఉద్యమాలకు ద్రోహం చేసి మరీ అదే ఊడిగాన్ని కొనసాగించారు. కేసీఆర్ నాయకత్వాన చివరిదశ ఉద్యమ కాలంలో తమ పాత్ర ఏమిటో జీవన్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, రేవంత్రెడ్డి సహా ఈ యావత్ బృందం తమకు ప్రియమైన శ్వేతపత్రాన్ని ప్రకటించగలదా? ఆ ధైర్యం, నిజాయితీ ఉన్నాయా? ఇప్పుడు అధికారం కోసం, ఎన్నికలు సమీపిస్తుండగా, తత్తరలు పడుతూ, నికరమైన అంశాలు ఏవీ కన్పించక, మయసభలో లేని పావురాలను ఊహించుకొని ఆశలు పడుతూ, రాబందుల వలె ముసురుతున్నారు. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ముసురుతున్న మూడవ రాబందులు బీజేపీ వారు. వారు ఏమిటన్నది ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు, హావభావాలు, సం స్కారం, చేతలను రోజువారీగా గమనిస్తున్న ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. జాబితాలు రాయవలసిన అవసరమే లేదు. మొదట జనసంఘ్, తర్వాత బీజేపీ ఈ దేశంలో, తెలుగు భూమిలో ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ, ఇంత టి అధికార దాహం, అధికార దుర్వినియోగం, హీనమైన వ్యవహరణ, కుసంస్కారం, కుట్రపూరిత తత్వం, దుష్టమైన భాష, రోత కలిగించే అసభ్యత, భారతీయతకూ, హిందూ మతానికీ మచ్చలు తెచ్చే వికృత సంస్కృతి గతంలో ఎన్నడూ లేవు. దీనంతటికి రూపుదిద్దిన ప్రతీకగా బండి సంజయ్ అనే రాబందు ఒకటి ఢిల్లీ రాబందులు తోడురాగ రెక్కలు అల్లల్లార్చుకుం టూ తెలంగాణపై వేట కోసం ముసురుతున్నది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
టంకశాల అశోక్