న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బ్యూరోక్రాట్ల నియంత్రణపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం ధిక్కరించిందని ఆరోపించింది. అధికారుల బదిలీ కోసం తాము ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అడ్డుకుంటున్నదని విమర్శించింది. ఈ నేపథ్యంలో ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది. ఢిల్లీ పాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు గురువారం తెరదించింది. 2019 నాటి సింగిల్ జడ్జీ తీర్పును తోసిపుచ్చింది. అన్ని రాష్ట్రాల తరహాలోనే ఢిల్లీలో పరిపాలన ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ల్యాండ్, పోలీస్, లాపై అధికారం మాత్రమే కేంద్రానికి ఉంటుందని తెలిపింది. మిగిలిన అన్ని అంశాలపై శాసనాధికారం కేజ్రీవాల్ సర్కార్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. అధికారులపై నియంత్రణ, వారి నియామకాలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్తోసహా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
కాగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. సేవల కార్యదర్శి ఆశిష్ మోర్ను తొలగించారు. అలాగే పరిపాలనలో పునర్వ్యవస్థీకరణ చేపడతామని స్పష్టం చేశారు. ప్రజా పనులకు అడ్డంకిగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సక్రమంగా పని చేయని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు సర్వీసెస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఆశిష్ మోర్ బదిలీ చట్టవిరుద్ధమని ఆ శాఖ పేర్కొంది. ఒక అధికారి పదవీ కాలం పూర్తి కాకముందే బదిలీకి సంబంధించిన ప్రతిపాదిత నోటీస్ పరిశీలన కోసం సివిల్ సర్వీసెస్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గతంలో కోర్టు ఆదేశించిన సంగతిని గుర్తు చేసింది. ఆశిష్ మోర్ బదిలీకి ముందు ఈ ప్రక్రియ చేపట్టనందున ఆయన ట్రాన్స్ఫర్ వీలుకాదని ఆ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో అధికారుల నియంత్రణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం ధిక్కరించిందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో శుక్రవారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుపాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆయన కోరారు.