సారపాక, డిసెంబర్ 24: ఈ నెల 28న భద్రాచలానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ శనివారం పర్యవేక్షించారు. సారపాకలోని ఐటీసీ బీపీఎల్ స్కూల్ గ్రౌండ్లో హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, ఈ నెల 26వ తేదీ సాయంత్రానికి పూర్తికావాలని, చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఆద్యంతం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో దర్శనం అనంతరం రాష్ట్రపతి బస చేయనున్న ఐటీసీ గెస్ట్హౌస్లో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఐటీసీ పరిసరాల్లో ఎస్టీడీ, ఐఎస్డీ సౌకర్యం ఉండేలా ఐటీసీ ఉన్నతాధికారులు, అధికారులు చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీపీవో లక్ష్మీరమాకాంత్, పీఆర్ ఈఈ మంగ్యా, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, ఆర్డీవో రత్నకల్యాణి, డీఎస్పీ సత్యనారాయణ, తహసీల్దార్ భగవాన్రెడ్డి, ఈవో మహేష్ పాల్గొన్నారు.
28న సారపాకలో 144 సెక్షన్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో ఈ నెల 28న సారపాక, ఐటీసీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. రాష్ట్రపతి భద్రత ప్రొటోకాల్ ప్రకారంగా ఏర్పాట్లను సారపాక, భద్రాచలంలో ఏర్పాట్లను ఎస్పీ వినీత్, ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.
ఇంటింటి తనిఖీలు
స్థానిక పారిశ్రామిక వాడలోని ఒడియా క్యాంప్, గాంధీనగర్, భాస్కర్నగర్, విజయ్నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పాల్వంచ సీఐ నాగరాజు, బూర్గంపహాడ్ ఎస్సై సంతోష్, పాల్వంచ సబ్ డివిజన్లోని ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు శనివారం ఇంటింటికీ వెళ్లి తనిఖీ (కార్డెన్ సెర్చ్) చేశారు.
పర్యటన ఇలా…
భద్రాచలం, డిసెంబర్ 24: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ అనుదీప్ శనివారం పరిశీలించారు. 28న సారపాక, భద్రాచలంలో 144వ సెక్షన్ విధించినట్లు చెప్పారు. ఈ రెండు ప్రాంతాల్లోని విద్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రపతి ముందుగా రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారని, అనంతరం ‘ప్రసాద్’ పథకం కింద రూ.50కోట్లతో రామాలయంలో చేపట్టే పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారని, అక్కడి నుంచి నేరుగా వీరభద్ర ఫంక్షన్ హాల్కు చేరుకొని గిరిజనులతో ముఖాముఖి ఉంటుందన్నారు.