ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం.. ఇప్పుడు ఏకంగా అన్నదాతలను అవమానపరుస్తున్నది. ‘నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా వ్యవహరిస్తూ.. ‘రాష్ట్ర ప్రజలు నూకలు తినండి’ అంటూ కించపరిచేలా మాట్లాడుతున్నది. గురువారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం కాగా, తెలంగాణ రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. వాతావరణ పరిస్థితుల వల్లే యాసంగిలో నూకలు అవుతున్నాయని శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నా పట్టించుకోకుండా హేళన చేస్తున్న తీరుపై భగ్గుమంటున్నారు. ఇంత అహంకారం పనికిరాదని, గోయల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జగిత్యాల (నమస్తే తెలంగాణ) : నిజానికి దేశంలోనే తెలంగాణ వాతావరణ పరిస్థితులు, శీతోష్ణ స్థితిగతులు వేరు. ఈ పరిస్థితులే వరిపై ప్రభావం చూపుతున్నాయి. వానకాలంలో పండే వరితో పోలిస్తే.. యాసంగిలో పండే ధాన్యం సమయం ఎక్కువగా తీసుకుంటుంది. మార్చి నుంచే ఎండలు మొదలవుతుండగా, ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతాయి. దీని వల్ల వడ్ల గింజలు పగులుతున్నాయి. ఫలితంగా వాటిని మర వేసినప్పుడు నూకల శాతం పెరుగుతున్నది. ఇక్కడి వాతావారణ పరిస్థితులే తప్ప.. పండించే విధానంలో మార్పు లేదు. అలాగని రైతు నూకలు అయ్యే పంటలు వేయడం లేదు. యాసంగిలో పండే పంట ఇలాగే ఉంటుంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే.. యాసంగిలోనూ నూకలు రాకుండా ఉండే ధాన్యం సీడ్ మార్కెట్లోకి రావాలి. దీనిపై వ్యవసాయ సంస్థలు పరిశోధన చేస్తున్నాయి. రాష్ట్రంలో యాసంగిలోనూ రా రైస్ వచ్చే విధంగా విత్తనోత్పత్తి చేసే పనిలో పడ్డాయి. అయితే ఈ ప్రయోగాలు విజయవంతం కావడానికి సమయం పడుతుంది. నిజానికి ఈ తరహా పరిశోధనలు చేయాల్సింది కూడా కేంద్రమే. కానీ, ఈ దిశగా ఏనాడూ ప్రయత్నం చేయలేదు. కనీసం ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ‘ఎవరి చావు వారు చస్తారులే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నది. ఎందుకని అడిగితే.. నూక వస్తున్నదని, అందుకే కొనలేమని చేతులెత్తేస్తున్నది.
ఇన్నాళ్లూ ధాన్యం కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతున్నది కేంద్రం.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ప్రజానీకాన్ని హేళన చేసింది. ‘మీ రాష్ట్ర ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి. సమస్య పరిష్కారమవుతుంది.’ అంటూ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను, అన్నదాతలను అవమానించేలా, అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ‘నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు’ అన్నట్లుగా.. ధాన్యం కొనకపోగా.. ఆపై వ్యంగ్యపు మాటలతో అవమానపరచడాన్ని రాష్ట్ర ప్రజలు, రైతులు సహించలేక పోతున్నారు. దేశంలోని ఆయా రాష్ర్టాల్లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండుతాయని, దిగుబడి సైతం అలాగే వస్తుందని, తెలంగాణలో యాసంగిలో పండే ధాన్యం నూకలు అవుతుందని, ప్రకృతి రీత్యా జరిగే ఈ మార్పులను అడ్డుకునే శక్తి ప్రస్తుతం ప్రభుత్వాలకు, రైతులకు లేదని చెబుతున్నారు. శాస్త్రీయంగా చూసినా ఇందులో మానవ తప్పిదం లేదని, అలాంటప్పుడు పండించిన పంటను మద్దతు ధరకు కొని బియ్యంగా మార్చుకునే ప్రక్రియపై కేంద్రం దృష్టిపెట్టాల్సింది పోయి.. ‘తెలంగాణ ప్రజలు నూకలు తినుండ్రి’ అంటూ హేళన చేయడంపై మండిపడుతున్నారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోదీ సర్కారు తీరును రైతులు ఎండగడుతున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
రైతును రాజును చేయాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. గడిచిన ఏడేళ్ల కాలంలో ప్రణాళికాబద్ధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వచ్చింది. భారీ ఎత్తున ప్రాజెక్టులను నిర్మించింది. ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అనతి కాలంలో పూర్తి చేసింది. చెరువులను పునరుద్ధరించి జీవం పోసింది. కాలువలకు మరమ్మతులు చేసింది. వరద కాలువను జీవనదిలా మార్చింది. వీటన్నింటితో భూగర్భజలాలను పెంచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలపాటు ఉచిత కరెంటు ఇచ్చింది. రైతు బంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్నది. రైతుకు ఏమైనా జరిగితే ఆదుకునేందుకు రైతు బీమాను తెచ్చింది. వ్యవసాయ విధానాలను అనుకూలంగా మార్చడంతో రైతుల ఆత్మహత్యలు పోయి.. రైతు రాజు అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశానికి అన్నం పెట్టే రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రం మద్దతు ధరతో కొనుగోలు చేస్తే రైతుల ఇబ్బందులు తొలిగిపోతాయి. కానీ, మోదీ సర్కారు మోకాలడ్డుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రణాళికలు లేకపోవడమే. పంటల ఎగుమతులు, దిగుమతులను చూసుకోవాల్సింది, మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాల్సింది కేంద్రమే. రాష్ర్టాలు తీసుకుంటున్న చర్యలతో పెరిగిన దిగుబడులకు అనుగుణంగా ధాన్యం ఎగుమతులను చూసుకొని ఉంటే.. ఈ రోజు ఈ దైన్య పరిస్థితి వచ్చేది కాదు. కేంద్రం తన ప్రణాళిక లోపాన్ని ఒప్పుకోకుండా.. నూకల పేరిట తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది.
కేంద్రంలో మోడీ సర్కారు వత్తే అందరి బతుకులు బాగుపడుతాయనుకున్నం. కానీ ఇంత బాధలు పెడుతారని అనుకోలె. అన్ని ధరలు పెరిగి ప్రజలు, రైతుల జీవితాలు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నాయ్. రాష్ట్ర సర్కారు ఎవుసానికి రైతుబంధు ఇచ్చింది. 24గంటల ఉచిత కరెంటు ఇత్తున్నది. కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటుంటే పండించిన వడ్ల గింజలను కొనకుండా కేంద్ర సర్కారు ఏశాలేత్తున్నది. దేశానికే అన్నంపెట్టే రైతును గోసపెట్టిన ఏ సర్కారు భవిష్యత్లో బాగుపడలేదు. గీబీజేపీ సర్కారు వచ్చినంకనే మారైతులకు కష్టకాలమొచ్చింది. దేశ ప్రధాని కేసీఆర్ అయితే మాగోస తీరుతుండే. వడ్లు కొనాలని మంత్రులు పోయి అడిగితే పీయూష్ హేళనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కోళ్లు తినే నూకలు మేము తినాల్నా..? ఆయనకు ఎంత ధైర్యం.
– ఉత్తెం శ్రీనివాస్, రైతు మల్కపేట, రాజన్న సిరిసిల్ల
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనం. యావత్ తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడేందుకు ఆయనకు ఎంత ధైర్యం. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ప్రజలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలి. లేదంటే తగిన గుణపాఠం చెబుతం. రైతన్నపై కేంద్రం ఇంతలా కక్షపూరితంగా వ్యవహరించడం కరెక్ట్కాదు. రాష్ట్రలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కేంద్రమే కొనాలి. లేదంటే మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతం.
-శ్రీగిరి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్, సుల్తానాబాద్
పంట కొనేది పోయి తెలంగాణ ప్రజలు, రైతులను పీయూష్ గోయల్ అవమానించేలా మాట్లాడడం సరికాదు. మనల్ని నూకలు తినాలని చెప్పడానికి ఆయనెవరు. ఇక్కడి ప్రజలు ఆయనకు ఎలా కనబడుతున్నరు..? ఒక కేంద్ర మంత్రిగా ఉండి అలా మాట్లాడడం సిగ్గు చేటు. దీనికి రాష్ట్రంలోని బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. తక్షణమే ఆయన్ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలి. ధాన్యం కొనకుండా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుంటే.. మంత్రులు ఇలా హేళన చేయడం వారికే మంచిది కాదు. ఇప్పటికైనా ధాన్యం కొనాలి.
– కొత్త శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్, మంథని.
నూకలు అలవాటు చేసుకోవాలని చెప్పడానికి పీయూష్ ఎవరు. ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన మంత్రి పీయూష్ రాష్ట్ర ప్రజలను, రైతులను అవమానపర్చారు. ఏ ప్రాంతంలోనైనా పంట ఉత్పత్తులు, అక్కడి భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితి, మృత్తిక రకాలు, వాటి సారంపై ఆధారపడి ఉంటాయన్న ఇంగితజ్ఞానం కేంద్ర మంత్రులకు, ప్రభుత్వానికి లేకపోవడం అత్యంత బాధాకరం. రాష్ట్రంలో యాసంగిలో ఉష్ణోగ్రతలు 38 నుంచి 42 డిగ్రీల మధ్య నమోదవుతాయి. ఇంతటి ఉష్ణోగ్రతల్లో వరి పంటకు ఇబ్బందులు రావడం సహజం. యాసంగి ధాన్యాన్ని మరాడించిన సందర్భంలో బియ్యం విరిగిపోయి, నూక ఎక్కువగా వస్తుందని అందరికీ తెలుసు. ధాన్యం నూకకావడం రైతుల తప్పిదమా..? శీతోష్ణస్థితి, భౌగోళిక పరిస్థితి అన్న విషయం ఏ శాస్త్రవేత్తను అడిగినా చెబుతారు. తెలంగాణ వాతావరణ పరిస్థితులు తెలిసి, ఇక్కడి ధాన్యాన్ని సేకరించవద్దన్న దురుద్దేశంతో అవమానించేలా నూకలు తెలంగాణ ప్రజలకు అలవాటు చేయాలంటూ, మాట్లాడడం పీయూష్ గోయల్ బలుపునకు నిదర్శనం. తెలంగాణ ప్రజలు, రైతులు ఎంత సాత్వికులో, ఆవేశం వస్తే అంతకు రెట్టింపు ఉగ్రరూపం దాల్చుతారన్న విషయం ఆయన గుర్తించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను గుర్తించి ధాన్యాన్ని కొనాలి.
– బద్రి నరేష్, ఇన్కం టాక్స్ కన్సల్టెంట్, జగిత్యాల
ధాన్యం కొనాలని మంత్రులు వెళ్లి అడిగితే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దుర్మార్గంగా మాట్లాడిండు. నూకలు తినాలని తెలంగాణ ప్రజలు, రైతులను హేళన చేయడం విచారకరం. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. రానున్న రోజుల్లో మీకు అధికారమనే నూకలు లేకుండా చేస్తం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయం పండుగలా మారింది. ఇపుడు ధాన్యం కొనమంటే ఎలా..? ఎందుకింత వివక్ష..? తెలంగాణ అంటేనే కేంద్రానికి నచ్చడం లేదు. ఏదో రకంగా ప్రజలు, రైతులను ఇబ్బందులు పెడుతుంది. ఏదిఏమైనా ధాన్యాన్ని కొనాల్సిందే. లేదంటే ఊరుకునేది లేదు.
– గడ్డం నర్సయ్య, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్, రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనేదాక కొట్లాడుతం. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేసిన పాలకవర్గాలకు కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో మండల ప్రజాపరిషత్, డీసీఎంఎస్, సహకార సంఘాలు, రైతు సంక్షేమ వేదికలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాలకవర్గాలు తీర్మానాలు చేయాలి. అన్నదాతకు అండగా ఉండి టీఆర్ఎస్, ప్రభుత్వం చేస్తున్న ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులకు ధన్యవాదాలు.
– తోట ఆగయ్య, టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు.
దేశానికే అన్నం పెడుతున్న తెలంగాణ రైతులను, ఇక్కడి ప్రజలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానించే విధంగా మాట్లాడుతున్నరు. నూకలు తినడం అలవాటు చేసుకొమ్మని చెప్పడం ఏమిటి. తెలంగాణ రైతుల మీద ఎందుకింత వివక్ష. ఎన్కటి రోజులు మళ్ల చూపిస్తమనే కదా వాళ్ల అభిప్రాయం. తెలంగాణ ప్రజలు దేశానికి అన్నం పెట్టెటోళ్లే కాదు. దేశం కోసం పోరాటం చేసే సత్తా ఉన్నోళ్లు. ఇక్కడి రైతులను అవమానించేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోం. తెలంగాణ అంటే మొదటి నుంచి బీజేపీ నాయకులకు నచ్చదు. అందులో ఇప్పుడు బాగు పడుతున్న తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్నరు. ఏ రాష్ట్రంలో ఏ పంట పండినా కొనే బాధ్యత ఎఫ్సీఐదే కదా. మా రైతులు పండించిన వడ్లు ఎందుకు కొనరు. మా పార్టీ తరపున పీయూష్ గోయల్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నం.
– గుడికందుల సత్యం, సీపీఎం నగర కార్యదర్శి, కరీంనగర్.
ఎనకట బియ్యం దొరక్క.. ఏం లేక నూకల గంజి తాగి పెరిగినం. ఎన్నో కష్టాలుపడ్డం. ఇప్పుడిప్పుడే అందరి బతుకులు బాగుపడ్డయి. పంటలు మస్తు పండుతున్నై. కేసీఆర్ పాలనల తెలంగాణ ప్రజలు సంతోషంగ ఉన్నరు. అన్ని రాష్ర్టాల మాదిరిగా ధాన్యం కొనాలని మన మంత్రులు పోయి అడిగితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పించండి అని హేళనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయనో మంత్రిలా మాట్లాడలేదు. మేం పండించిన పంటను కొనుగోలు చేయడానికి ఎన్నో రకాల కొర్రీలు పెడుతూ తప్పించుకుంటున్నరు. దేశానికి అన్నం పెట్టే రైతుల ఉసురుపోసుకున్నోళ్లు ఇప్పటివరకు ఎవరూ బాగుపడలే.
– రాంరెడ్డి, రైతు పూడూరు
పంజాబ్లో రెండు సీజన్లలో ధాన్యం కొంటరు. మన వద్ద మాత్రం కొనరు. కొనాలని అడిగితే కొర్రీలు పెడుతరు. రైతుల కోసం రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి పోయి అడిగితే హేళనగా మాట్లాడుతరు. పీయూష్ గోయల్కు ఎంత ధైర్యం. తెలంగాణ ప్రజలు, రైతులను నూకలు తినమంటడా..? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడుతడా..? ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. క్షమాపణ చెప్పాలి. మట్టిలో పుట్టి.. మట్టిలో పెరిగినోళ్లం నూకలే కాదు ఏది తిన్నా జీర్ణించుకోగలం. ఆయనో కేంద్ర మంత్రి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.
– తిరుపతిరెడ్డి లక్ష్మారెడ్డి, రైతు, లక్ష్మీపూర్
ఇప్పుడంటే ఎవుసం పండుగైంది గని, ఒకప్పుడు పడ్డ కష్టాలకు లెక్కలేదు. ఎవుసం చేయడం, వరి పండించడం అంటే చుక్కలు కనిపించేవి. ధాన్యం సరిగా పండేవి కావు. ఎకరం భూమిలో మూడునాలుగు పల్లాలు పండితే అదే గొప్ప. ఇప్పుడు 20 క్వింటాళ్లకుపైగా పండుతున్నయ్. వరి అన్నం అంటే పండుగప్పుడు తినుడే. పండిన వడ్లను ఎండవోసి దంచి బియ్యంగా మార్చేది. దంచేటప్పుడే నూకలు అచ్చేటియి. పండుగపూట బియ్యం వండుకొని, దీని కంటే ఎక్కువగా మక్క గట్కనే తినేది. బుద్ధి పుట్టినపుడు మాత్రమే నూకల అన్నం తినేది. లేదంటే నూకల జావ కాచుకునేది. నూకల అన్నం తింటే సరిగా అరగకపోయేది. ఇంట్లోళ్లందరికీ కడుపు నొప్పి వచ్చి చాలా అవస్థలు పడేది. కాలక్రమంలో మక్కగట్క పాయె. నూకల అన్నం పాయె. ఇప్పుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ మునుపటి లెక్క నూకల అన్నం తినడం అలవాటు చేయుండ్రని అన్నడట. ఆయన మతి ఉండే మాట్లాడుతున్నడా..? అధికారం ఉందని తెలంగాణ రైతులను, ప్రజలను అవమాన పర్చే హక్కు వారికి ఎవరు ఇచ్చిన్రు. బాధ్యత కలిగిన మంత్రులు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసి, ఆదుకోవాలి. అంతే తప్ప అవహేళన చేయడం సరికాదు.
– మ్యాడారం కమల, జగిత్యాల
యాసంగి సీజన్లో నూకలు కావడానికి వాతావరణ పరిస్థితులే కారణం. నిజానికి తెలంగాణలో యాసంగి పంట కాలం నవంబర్ 15 నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 10 వరకు నార్లు పోస్తారు. నవంబర్, డిసెంబర్లో చలితీవ్రత ఎక్కువగా ఉండి నారు పెరుగదు. ఫలితంగా నాట్లు వేయడం ఆలస్యవుతుంది. వానకాలం పంటకాలంతో పోలిస్తే యాంసంగి పంటకు ఇరవై నుంచి ఇరువైదు రోజులు ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో ఎండలు ముదిరిపోయి పంటపై ప్రభావం పడుతుంది. దీని వల్ల నూక శాతం ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఉన్న భౌగోళిక వాతావరణం, దాని ఆధారంగా ఉండే శీతోష్ణస్థితి వల్ల ఈ పరిస్థితులు ఉంటాయి. వీటిని మార్చడం మన చేతుల్లో లేదు. పంజాబ్ లాంటి రాష్ర్టాల్లో యాసంగి సీజన్ ధాన్యానికి బదులు గోధుమలను సాగు చేస్తారు. అయితే మన వద్ద యాసంగిలోనే కాదు, వానకాలంలో సైతం గోధుమ సాగు సాధ్యం కాదు. ఒక ప్రాంతంలో ఉన్న భౌగోళిక వాతావరణం, వాటిపై ఆధారపడిన శీతోష్ణస్థితి, మృత్తిక రకాలు అక్కడ పండించాల్సిన పంటలను నిర్దేశిస్తాయే తప్ప మరే ఇతర అంశాలు పంటలను నిర్దేశించలేవు.