అమరావతి : దేశంలోనే గంజాయి సరఫరాలో ఏపీ మొదటి స్థానంలో ఉందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. 2021కి చెందిన నివేదికను ఎన్సీబీ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఏడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు నివేదికలో ఎన్సీబీ తెలిపింది. ఇందులో ఏపీ నుంచి 26 శాతం గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. రెండో స్థానంలో ఒడిశా ఉంది. దేశంలో 50 శాతం గంజాయి ఈ రెండు రాష్ట్రాల్లోనే సాగవుతోంది.
ఏపీలో గంజాయి సరఫరాపై 1,775 కేసులు నమోదయ్యాయి. గంజాయిని తరలిస్తూ పట్టుబడిన 4,202 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో 35,270 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మత్తు పదార్ధాల ప్రభావం పంజాబ్ లో ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. హెరాయిన్ విషయంలో గుజరాత్ తొలి స్థానంలో ఉందని తెలిపారు. రెండో స్థానంలో యూపీ ఉందని చెప్పారు.