AP News : వైసీపీ అధినేత వైఎస్ జగన్పైన, ఆ పార్టీ నేతలపైన పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కులాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ అండ్ కో పనిగా పెట్టుకుందని, వారి ప్రజావ్యతిరేక చర్యలవల్లే ప్రజలు గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేశారని దుయ్యబట్టారు. అంతటి ఘోర పరాజయం తర్వాత కూడా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని, మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో జడ్జిలు, వారి కుటుంబాలపై సైతం దుష్ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపడ్డారు.
రైతుల పేరుతో వైసీపీ నేతలు తనపై, సంగం డెయిరీపై చేస్తున్న ఆరోపణలను ధూళిపాళ్ల తీవ్రంగా ఖండించారు. తాము ప్రభుత్వాలపై ఆధారపడి వ్యాపారం చేయడం లేదని, గత 15 ఏళ్లుగా డెయిరీ అవసరాల కోసం మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని స్పష్టంచేశారు. మొక్కజొన్న కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమని, అన్నదాతలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు తన స్వార్థం కోసం మహిళలను రోడ్లపైకి తెచ్చి కేసుల్లో ఇరికిస్తున్నారని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.