AP News : ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిందని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే భయం చంద్రబాబుకు పట్టుకుందని, అందుకే నిరంతరం వైసీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ కుటుంబానికి పులివెందులలో ఎన్నడూ ఓడిపోయిన చరిత్ర లేదని ఆయన గుర్తుచేశారు.
చంద్రబాబు నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, అధికారంలోకి వచ్చాక రూ.3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చిన కూటమి ప్రభుత్వం ఆ నిధులతో రాష్ట్రానికి ఏం చేసిందని అంబటి ప్రశ్నించారు. వైసీపీని తిట్టడం తప్ప వీరికి పాలన చేతకావడం లేదన్నారు. రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధర లేదని, మొక్కజొన్న ధరలపై ప్రశ్నిస్తే గోడౌన్లపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతర్జాతీయ యుద్ధాల నెపంతో పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూసే కనీస ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదని, చంద్రబాబు, లోకేష్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అంబటి ఆరోపించారు.