హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): విశాఖ మధురవాడలో అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థకు 130 ఎకరాలు, శారదా పీఠానికి 15 ఎకరాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. నవంబర్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్లైన్లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్కు, రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరా కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. యూనిట్కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొనుగోలు ప్రతిపాదనలతోపాటు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు సరఫరాకు త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధి, విశాఖలో తాజ్వరుణ్ బీచ్ ప్రాజెక్ట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.