హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఈ నెల 15 వరకు ఇంకో 23.68 టీఎంసీల నీరు ఉపయోగించుకొనేందుకు అనుమతివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను కోరింది. గతంలో ఏపీకి 207 టీఎంసీలను కేటాయించారు. ఇందులో నవంబర్ 30 వరకు ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 183.32 టీఎంసీల నీటిని ఉపయోగించుకున్నామని ఏపీ తన ఇండెంట్లో వెల్లడించింది. ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి నీళ్లు సముద్రంలోకి పోయే రోజుల్లో అదనంగా 32.16 టీఎంసీలు తీసుకున్నామని తెలిపింది. దీంతో ఏపీ మొత్తం 215.48 టీఎంసీలను వాడుకున్నది.
ఈ నెల 15 వరకు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి 11.77 టీఎంసీలు, ఎడమ కాలువ నుంచి 2.55, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5.22, హంద్రీనీవా నుంచి 4.14 టీఎంసీలు తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే, కృష్ణా డెల్టా సిస్టం కింద ఎంత నీటిని ఉపయోగించుకున్నదో ఏపీ చెప్పలేదు. యాసంగి సీజన్ సాగు అవసరాల వివరాలను సైతం పొందుపరచలేదు. గురువారం వెబినార్ ద్వారా నిర్వహించే కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీలో ఇండెంట్పై చర్చించి, నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వనున్నారు. తెలంగాణ తన ఇండెంట్ గురువారం ఉదయం ఇచ్చే అవకాశమున్నది.