అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పాయింట్మెంట్ కావాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయ పడ్డారు. తనతోపాటు అఖిలపక్ష నేతలను తీసుకు రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి వైఎస్ జగన్మోహన రెడ్డి మరోసారి లేఖ రాశారు. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని కోరారు. దీనిపై కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘విశాఖ స్టీల్స్పై కేంద్ర ప్రభుత్వ ప్రకటన తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నదిద. ఈ సంస్థ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశం. స్టీల్ప్లాంట్పై ప్రత్యక్షంగా 20వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. అఖిలపక్షం, కార్మిక సంఘాల ప్రతినిధులను వెంట తీసుకొస్తాం. ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాం. ప్లాంట్ పునరుద్ధరణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మన ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ప్లాంట్పై దృష్టిపెడితే కచ్చితంగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని పునరుద్ఘాటించారు.
విశాఖ ఉక్కు సంస్థ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ సోమవారం వైఎస్ఆర్సీపీ ఎంపీ సత్యనారాయణ మూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన సంగతి తెలిసిందే. వందశాతం విశాఖ స్టీల్స్ను ప్రైవేటీకరిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పక్షాలు ఉధ్రుతంగా ఆందోళన చేస్తున్నాయి. విశాఖ స్టీల్తోపాటు పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రెండు బ్యాంకులు, రెండు బీమా సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం సంపాదించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.