హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కేరళ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాప్తించి ఉన్నది. సోమవారం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. వాతావరణ మార్పుల కారణంగా మరో రెండురోజులపాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ అక్కడక్కడ వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నది. మంగళవారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కురిసింది.