Bangladesh : ఆందోళనలతో హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. హిందువులపై దాడి చేయడం, హత్య చేయడం వంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో హిందువును హత్య చేశారు. 23 ఏళ్ల చంచల్ చంద్ర భౌమిక్ అనే యువకుడిని సజీవ దహనం చేసి చంపేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్, నార్సింగ్డి జిల్లాలోని మసీద్ మార్కెట్ ఏరియాలో శుక్రవారం రాత్రి జరిగింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. చంచల్ చంద్ర.. కుమిల్లా జిల్లా, లక్ష్మీపూర్ అనే గ్రామంలోని ఒక గ్యారేజ్లో కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు. అక్కడే షట్టర్ మూసి శుక్రవారం రాత్రి నిద్రపోయాడు. అతడు గ్యారేజ్లో నిద్రిస్తుండగా.. కొందరు దుండగులు బయటి నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించారు. క్షణాల్లోనే మంటలు లోపలిదాకా వ్యాపించాయి. దీంతో చంచల్ చంద్ర లోపలే అగ్నికి ఆహుతి అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. దాదాపు అరగంటపాటు శ్రమించి, మంటల్ని ఆర్పేశారు. అనంతరం చంచల్ చంద్ర మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు.
ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య అని ఆరోపించారు. నిందితుల్ని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు అక్కడ హిందువులకు భద్రత లేకపోవడంపై హిందువులు సహా, మైనారిటీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.