నేత్రపర్వంగా మహాకుంభ సంప్రోక్షణ ఘట్టాలు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా చేపడుతున్న అధివాస, అభిషేక ఘట్టాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఆరో రోజైన శనివారం ప్రధానాలయంలో శిలామూర్తులకు ఏకాశీతి కలశాభిషేకం, ధాన్యాధివాసం, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించారు. బాలాయంలో సప్తాహ్నిక పంచకుండాత్మక మహాయాగం వైభవోపేతంగా సాగుతున్నది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధానాలయాన్ని సందర్శించి ఈ నెల 28నాటి మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈఓ గీత, వివిధ శాఖల అధికారులతో
సుదీర్ఘంగా సమీక్షించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా చేపట్టిన అధివాస, అభిషేక పర్వ ఘట్టాలు చివరిదశకు చేరుకున్నాయి. 6వ రోజు శనివారం స్వామివారి ప్రధానాలయంలో శిలామూర్తులకు ఉదయం ఏకాశీతి కలశాభిషేకం నిర్వహించగా, రాత్రి ధాన్యాధివాసం, నిత్యలఘుపూర్ణాహుతిని పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో ప్రధానార్చకుల బృందం నిర్వహించింది. స్వామివారి బాలాలయంలో ఉదయం శాంతిపాఠం, చతుస్థానార్చన, ద్వారతోరణ ధ్వజకుంభారాధన, మూలమంత్ర హవనం చేపట్టారు. సాయంత్రం సామూహిక శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం, చతుస్థానార్చనలు నిర్వహించారు.
81 కలశాలతో శిలామూర్తులు, సుదర్శన
యాదాద్రి ప్రధానాలయంలో అభిషేక పర్వాలు శాస్ర్తోక్తంగా సాగుతున్నాయి. శనివారం ప్రధానాలయ ముఖ మండపంలో శిలామూర్తులు మహా సుదర్శన చక్రం, ఆళ్వారులు, గరుఢ, విష్వక్సేనుడు, భగవత్ రామాజనుజాచార్య, ఆండాళ్ విగ్రహమూర్తులకు అభిషేకం చేపట్టారు. ముఖ మండపంలో నిత్య లఘు పూర్ణాహుతి అనంతరం మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ప్రత్యేకంగా నిర్వహించే ఏకాశీతి కలశాభిషేకంలో భాగంగా 81 కలశాలతో ప్రతిష్టామూర్తులకు అవాహనం గావించారు. స్వామివారి బింబాలకు దివ్య దేహం రావడం కోసం 81 కలశాలు, 81 మంత్రాలు, 81 ఓషధులతో బింబాలకు ఆవాహనం చేసి అభిషేకం చేశారు. 400 నదీజలాలు, 3 సముద్రాల జలాలు, పంచామృతాలు, కస్తూరి, చందనాది సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల ఫలరసాలు, భగవత్ ప్రీతికరమైన యాలకులు, లవంగాది ఘన సుగంధ తీర్థరాజాలను ఒక్కటిగా చేసి, ఆరాధన పూర్వకంగా అభిషేకాలు చేపట్టారు. 108 మంది రుత్వికులచే లక్ష్మీనృసింహస్వామి మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలు కొనసాగుతున్నాయి.
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా బాలాలయంలో సప్తాహ్నిక పంచకుండాత్మక మహాయాగం వైభవోపేతంగా జరుగుతున్నది. ఉదయం స్వామివారి నిత్యారాధన అనంతరం 9గంటలకు శాంతి పాఠంలో మహాయాగాన్ని ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల సువర్ణమూర్తులకు నిత్యారాధన అనంతరం సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చనలు, మూలమంత్ర, మూర్తి మంత్ర హవనాలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, మరిగంటి శ్రీధరాచార్యులు, యజ్ఞాచార్యులు, పారాయణీకులు, ఏఈఓలు గజవెల్లి రమేశ్బాబు, గట్టు శ్రవణ్కుమార్, దోర్బల భాస్కర్శర్మ పాల్గొన్నారు.
కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ 50 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. బస్టాండ్ నుంచి పాతగోశాల మీదుగా కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, అక్కడి నుంచి గండిచెరువు నుంచి మొదటి ఘాట్ రోడ్డు గుండా కొండపైకి చేరుకోవచ్చు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి తెలిపారు. యాదాద్రి కొండకింద వైకుంఠద్వారం వద్ద దివిస్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంటును మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన యాదగిరి, శ్యామలత దంపతులు స్వామివారికి 9 బంగారు పుష్పాలు, రెండు వెండి కలశాలు అందించారు. రవికుమార్, హారిక దంపతులు రూ.17లక్షల విలువ చేసే బంగారు తీర్థపు గిన్నెను స్వామివారికి సమర్పించారు. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్రెడ్డికి అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు.