ముంబై : అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. అంతకుముందు దేశ్ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే, కార్యదర్శి సంజీవ్ పల్నాడెను కస్టడీలోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వజేను డిస్మిస్ చేశారు. ఇక బాంబే హైకోర్టు అనిల్ దేశ్ముఖ్ పిటిషన్ను స్వీకరించేందుకు తిరస్కరించింది. అవినీతి కేసులో తన కస్టడీని కోరుతూ సీబీఐ దరఖాస్తును సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం అనుమతించడాన్ని దేశ్ముఖ్ సవాలు చేశారు.
సీబీఐ కేసులో ఇద్దరు నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా బాంబో హైకోర్టు తోసిపుచ్చింది. అనిల్ దేశ్ముఖ్ ఉద్దేశపూర్వకంగానే కస్టడీని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. దేశ్ముఖ్ అందుకే తనంతట తాను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జేజే ఆస్పత్రిలో చేరారని దర్యాప్తు సంస్ధ పేర్కొంది. ఇక మనీలాండరింగ్ కేసుకు సంబంధించి అనిల్ దేశ్ముఖ్ను ఈడీ గత ఏడాది నవంబర్లో అరెస్ట్ చేసింది.
అవినీతి కేసులో దేశ్ముఖ్ను కస్టడీలోకి తీసుకునేందుకు ముంబై కోర్టు గతవారం సీబీఐని అనుమతించింది. కాగా ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరం వీర్ సింగ్ అప్పటి హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై సంచలన ఆరోపణలు చేశారు. నగరంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ 100 కోట్లు వసూలు చేయాలని పోలీస్ అధికారులకు దేశ్ముఖ్ టార్గెట్ విధించారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణల నేపధ్యంలో దేశ్ముఖ్పై కేసు నమోదు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించడంతో గత ఏడాది ఏప్రిల్లో దేశ్ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.