సీసీసీ నస్పూర్ : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణిలకు, పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాల ప్యాకెట్లను కొందరు అంగన్వాడీ టీచర్లు, సఫ్లై చేసే ఆటో డ్రైవర్లతో కుమ్మక్కై ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న మోసాలపై సీసీసీ నస్పూర్ పోలీసులు నిందితులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ వివరించారు.
సిద్దిపేట, వరంగల్కు చెందిన ఐసీడీఎస్ కాంట్రాక్టర్లు రాములు, శ్రీనివాస్ ట్రాలీలు అద్దెకు పెట్టి చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి, వేమనపల్లి, జైపూర్, భీమారం మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందజేసే పాలప్యాకేట్లు, కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో వేమనపల్లి మండల అంగన్వాడీ టీచర్లు జయప్రద, రాణి, కోటపల్లి మండలంలోని నక్కలపల్లి అంగన్వాడీ టీచర్ సరోజ, జైపూర్ మండలంలోని కాన్కూర్ అంగన్వాడీ టీచర్ మణేమ్మ, భీమారం మండలంలోని రాంపూర్ అంగన్వాడీ టీచర్ లక్ష్మిలతో పరిచయం చేసుకుని మిలాఖతయ్యారు. ప్రభుత్వం గర్భిణిలకు, చిన్న పిల్లలకు కోడిగుడ్లు, పాలను ఇవ్వకున్నా, రికార్డుల్లో ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించి వాటిని మంచిర్యాలలో ఇతరులకు విక్రయిస్తున్నారు.
పాలు, కోడిగుడ్లను ఆటోట్రాలీలో మంచిర్యాలకు తరలిస్తుండగా సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారని ఏసీపీ అఖిల్ మహాజన్ వివరించారు. 28పాల ప్యాకేట్ల కాటన్లు, 15ట్రేల కోడిగుడ్లను పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. వీటితో పాటు తరలిస్తున్న ఆటోట్రాలీని స్వాధీనం చేసుకుని, చెన్నూర్ కోటబొగుడకు చెందిన డ్రైవర్ సంతోశ్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ దందాపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.