హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ జిల్లా మూసాపేట్ మండలం నందిపేట్ సమీపంలోని గజ్జెలోనిగుట్ట కింద 30 మీటర్ల గుహ, అందులో రాళ్లపై రాతిచిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇవి తామ్రయుగం నాటి రాతి చిత్రాలని అంచనా వేస్తున్నది.
బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గజ్జెలోనిగుట్ట కింద ఉన్న గుహలో 10 మీటర్ల ఎత్తైన రాతిబండపై ఎరుపు రంగులో చిరుత, విల్లు ధరించిన వేటగాడు, పొడవైన కొమ్ములతో దుప్పి, పొడవాటి తోకగల జంతువు తదితర బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ఇవి తామ్రయుగం (చాల్కోలిథిక్)లో చిత్రించినవి. కోకాపేట రాతిచిత్రాలను పోలివున్నాయి. గతంలో రాతి చిత్రాల్లో పెద్దపులి బొమ్మలు లభించాయని, ఇక్కడ చిరుతపులి కనిపించడం అరుదైనదని చరిత్రబృందం రాతిచిత్రాల నిపుణుడు బండి మురళీధర్రెడ్డి అభిప్రాయపడ్డారు.